హక్కులను నిర్ధారించారా: పోలవరం ముంపు గ్రామాలపై మాడభూషి శ్రీధర్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కోసం ఆదివాసులను తరలించడానికి ముందు అడవులపై వారికి హక్కులను నిర్ధారించారా? ఈ ప్రాజెక్టు కింద మునిగిపోవడానికి గ్రామసభలు పూర్తి అవగాహనతో కూడిన అంగీకారాన్ని వ్రాతపూర్వకంగా తెలిపాయా? మొదలైన అంశాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పర్యావరణ మంత్రిత్వశాఖను ఆదేశించారు. శ్రీ డి సురేశ్ కుమార్ దాఖలు చేసిన సమాచార అభ్యర్థనకు పర్యావరణ ఆటవీ శాఖ జవాబులేని కారణంగా రెండో అప్పీలు దశలో కేంద్ర సమాచార కమిషన్ ముందుకు వచ్చింది.
పోలవరం ముంపు గ్రామాలలోఆటవీ హక్కుల రక్షణచట్టం అమలు చేయలేదని, దాని కింద తమకు రావలసిన హక్కులను నిర్ధారించనే లేదని, కానీ తమను తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని గ్రామసభల నుంచి అనేక వినతి పత్రాలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపించారనీ, వాటికి ప్రతిస్పందిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2011 ఫిబ్రవరి 2న రాసిన ఒక లేఖలో ఆటవీ శాఖ డైరెక్టర్ జనరల్ కార్యదర్శి స్థాయి అధికారి త్వరలో రాష్ట్రాన్ని పర్యటిస్తారన్నారు.
ఆ విధంగా ఉన్నతాధికారి వచ్చి పరిశీలించి ఇచ్చిన నివేదిక ప్రతిని ఇవ్వాలని, ఆ నివేదికపై తీసుకున్న చర్యలను, కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఆ విషయమై జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల ప్రతులు మొదలైన వివరాలు ఇవ్వాలని సురేశ్ కుమార్ కోరారు. సమాచార అధికారి ద్వారా గానీ, మొదటి అప్పీలు అధికారి ద్వారా గానీ సమాచారం రాకపోతే కమిషన్ ముందు అప్పీలు దాఖలు చేశారు.
బ్రిటిష్ పాలకులు 1927లో తెచ్చిన ఆటవీ రక్షణ చట్టం ప్రకారం ఏదైనా ఒక ప్రాంతాన్ని అడవిగా ప్రకటించి అక్కడ నివసించే వారిని తరలించే విపరీత అధికారాలను ఒక సెట్లింగ్ అధికారికి ఉందని, కేవలం అడవుల సంపదను తరలించుకుపోవడానికే ఆంగ్లేయులు వాడుకున్న ఈ చట్టం వల్ల ఆదివాసులు అన్యాయాలకు గురయ్యారని, ఈ సమస్యకు కొంత సమాధానం 2006లో వచ్చిన ఆటవీ హక్కుల రక్షణ చట్టంలో లభించిందని, ఈ హక్కులు నిర్ధారించకుండా ఆదివాసులను పోలవరం నుంచి తరలించడానికి చట్ట ప్రకారం వీల్లేదని దించారు.
2006లో పార్లమెంటు చేసిన షెడ్యూల్డుతెగలు ఇతర సంప్రదాయ ఆటవీ నివాసుల అటవీ హక్కుల చట్టం గిరిజనుల హక్కులను నిర్ధారించడంలో గ్రామసభ ప్రాధాన్యాన్ని వివరించింది. డిసెంబర్ 13, 2005 నాటికి ఆటవీ భూములను సాగు చేస్తున్నా, ఆటవీ ఉత్పత్తులమీద ఆధారపడి జీవనం సాగిస్తుంటే వారికి ఆ విధంగా జీవనం కొనసాగించే హక్కును ఈ చట్టం ద్వారా ప్రకటిస్తారు. తెండు పట్టాలు, ఔషధ మొక్కల పెంపకం, వాటిని సేకరించే హక్కు, పశులను మేపుకునే హక్కు, చెరువులను వాడుకునే హక్కు వస్తాయి.
సాగు హక్కులనీ వినియోగ హక్కులనీ రెండు రకాల హక్కులను గుర్తించకపోతే ఆదివాసులమీద ఆక్రమణదారులని కేసులు పెట్టి వేధిస్తారు. దరఖాస్తులు స్వీకరించిన తరువాత రెండు దశలలో వాటిని వడబోసి గ్రామ పంచాయతీలో పెద్దలు కాకుండా మొత్తం గ్రామసభ సమావేశాలలో తీర్మానాల ద్వారా హక్కులను ప్రకటిస్తారు. వీటిని తాలూకా జిల్లా స్థాయి అధికారులతో కూడిన కమిటీ నిజానిజాల పరిశీలించి హక్కులను ధృవీకరిస్తారు.
ఈ విధంగా హక్కులను నిర్ధారించకుండా ఆటవీ ప్రాంత ఆదివాసులను ప్రాజెక్టులకోసం తరలించడానికి వీల్లేదని ఈ చట్టం చాలా స్పష్టంగా నిర్దేశించింది. ఏ హక్కులున్నాయో తెలిస్తేనే వాటిని కోల్పోయినందుకు పరిహారం చెల్లించడానికి వీలవుతుంది. ఆ విధంగా తమ హక్కులు నిర్ధారించలేదని అనేక గ్రామాలనుంచి వినతులు వచ్చాయని, ఈ అంశాలను తెలుసుకోవడానికి కేంద్రం పంపిన ఉన్నతాధికారి నివేదిక, దాని చర్యల వివరాలు కావాలని డి సురేశ్ కుమార్ అడిగారు.
ఇవే కాకుండా ముంపు తరలింపు గ్రామాలలో గ్రామసభలను సంప్రదించవలసిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ హక్కులను షెడ్యూల్డు ప్రాంతాలకు విస్తరించే పెసా చట్టం కూడా సంప్రదింపు హక్కులను కల్పిస్తున్నది. ఆదివాసులు స్వచ్ఛందంగా ఇష్ట పూర్తిగా తెలిసి ఇచ్చే అంగీకారం ద్వారానే వారికి పరిహార పునరావాస పాకేజీలు ఇవ్వవలసి ఉంటుందని ఆటవీ హక్కుల చట్టం సెక్షన్ 4(2) వివరిస్తున్నది. ఈ వివరాలన్నీ ఇవ్వాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు.