తప్పు చేసింది కొడుకు...శిక్ష వేసింది తండ్రికి:ఎక్కడంటే?
పశ్చిమ గోదావరి జిల్లా:నాగరికత ఎంతగా అభివృద్ది చెందినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా అనాగరిక చర్యలు అమలవుతూనే ఉన్నాయనడానికి నిలెవెత్తు నిదర్శనమీ ఘటన...చట్టాన్ని కాదని నేటికీ భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ నే నడిపిస్తూ మనుషుల్ని దారుణంగా హింసిస్తున్న ఆ ఊరు...అక్కడి వ్యక్తుల వ్యవహారం తాజా ఘటనతో వెలుగు లోకి వచ్చి చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే...
పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం సాయంపాలెంలో నాగేంద్ర అనే యువకుడు అదే గ్రామానికి చెందిన చింతపల్లి ప్రసాద్ అనే వ్యక్తి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఆమె తన భర్తకు తెలియజేసింది. దీంతో అతడు ఈ విషయమై గ్రామంలో పంచాయితీ పెట్టించాడు.
తన ప్రవర్తన గురించి బైటకు తెలిసి పంచాయితీ పెడుతున్నారనే విషయం తెలియగానే నాగేంద్ర ఊరు నుంచి పరారయ్యాడు. దీంతో నీ కొడుకు నాగేంద్రను పంచాయతీకి అప్పగించాలని అతడి త్రండి సంజీవరావుని రెండు రోజుల క్రితం గ్రామ పెద్దలు ఆదేశించారు. అయితే కొడుకు పారిపోయాడని, ఎక్కడ ఉన్నాడో తెలియదని తండ్రి చెప్పడంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు ఆయనను ఊరి మధ్యలో చెట్టుకు కట్టేసి పంచాయితీ చేశారు.
దీంతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.