భారీ పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనకొండలోని ఇందిరమ్మకాలనీ గంగానమ్మపేటలో ఆదివారం ఉదయం జరిగిన పాతరంగు డబ్బా పేలిన ఘటనలో చికిత్స పొందుతున్న జాలాది నాగరాజు సోమవారం మరణించాడని పోలీసులు తెలిపారు. చిన్నారి గౌతమ్ ఘటనా ప్రదేశంలోనే మరణించిన విషయం విదితమే.
దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య రెండుకు చేరింది. నాగరాజు భార్య భవానీ అతని తల్లి నాగమణి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. గౌతమ్ మృతదేహానికి శవపంచనామా చేసి పూర్తిచేసిన పోలీసులు తిరిగి ముఖం పట్టగానే క్షతగాత్రుడు నాగరాజు కూడా మరణించిన విషయం తెలిసింది. వెంటనే మృతదేహానికి శవపంచనామా చేశారు. మంగళగిరి గ్రామీణ సీఐ మధుసూదనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యక్షసాక్షి చనిపోవటంతో చేజారిన సమాచారం*
పేలుడు ఘటనకు సంబంధించి వివరాలు తెలియజేయాల్సి వ్యక్తి చనిపోవటంతో పోలీసులకు లభించాల్సిన సమాచారం చేజారిపోయింది. గాయపడిన నాగరాజు నుంచి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
రంగు డబ్బాను 20రోజుల క్రితమే వాచ్మెన్గా పనిచేసే నాగరాజు తండ్రి వెంకటేశ్వరరావు ఇంటికి తెచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. క్షతగాత్రురాలు భవానీ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్లాస్టిక్ రంగుడబ్బాలో గ్యాస్ రాళ్లు ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. అవి ఎలాంటి రాళ్లు? పేలుడుకు అవి ఎలా దోహదపడ్డాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రత్యక్ష సాక్షి చనిపోవటంతో పోలీసులు మరో కోణంలో విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను బట్టి పోలీసులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.