ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో రిజర్వేషన్ విద్యార్థులకు తీరని అన్యాయం:రఘువీరారెడ్డి
Recommended Video
విజయవాడ:ఎంబీబీఎస్-2018 వెబ్ కౌన్సిలింగ్లో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని...ఈ ప్రక్రియలో లోపాలను వెంటనే సరిచేయాలని కోరుతూ సిఎం చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి లేఖ రాశారు.
ఈ వెబ్ కౌన్సిలింగ్ లో జరిగిన భారీ అవకతవకల వలన ఎస్సీ ఎస్టీ, బీసీ, రిజర్వేషన్ విద్యార్థులు మొత్తం మీద 500 సీట్లను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా కల్పించబడిన రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, లేదా ఉద్దేశపూర్వక తప్పిదం వలన రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడిచినట్లయిందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
అందువల్లే...ఈ అన్యాయం
జీవో 550 ని సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు 2017లో హైకోర్టులో పిటీషన్ వేయడం, దానిపై కోర్టు స్టే ఇస్తూ 2017 సెప్టెంబర్ 18లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని రఘువీరా గుర్తుచేశారు. ఇప్పటివరకూ దానిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంవల్లే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.
పొరపాటా...కావాలనేనా?
అయితే ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేయడం, ఈప్రక్రియలో గతంలో మాదిరిగా జోన్ని ఒక యూనిట్గా తీసుకోని కాకుండా కాలేజ్ని ఒక యూనిట్గా తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారని...దీనివల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వందలాది మంది వైద్య విద్యనభ్యసించే అవకాశాన్ని కోల్పోతున్నారని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు.
సిఎం దగ్గరే...చర్యలు తీసుకోవాలి
ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ సీఎం ఆధీనంలోనే ఉన్నందున సిఎం చంద్రబాబు ఈ విషయంపై దృష్టి సారించి తగు రీతిలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని రఘువీరా డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులకు న్యాయం చేసే దిశలో వెంటనే చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా జీవో 550 మీద హైకోర్టు ఇచ్చిన స్టేని వెకేట్ చేయించడంతోపాటు ఇప్పటి వరకూ జరిగిన కౌన్సిలింగ్ను రద్దు చేయాలన్నారు.
స్పందించకుంటే...కాంగ్రెస్ ఉద్యమం
550 జీవో ప్రాతిపదికన పాత కౌన్సిలింగ్ పద్దతి ప్రకారమే ఎంబీబిఎస్ సీట్లకు తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించి తీరాలని రఘువీరా పునరుద్ఘాటించారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించని పక్షంలో రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి హెచ్చరించారు.