అమాయకులను వైసిపి కేసుల్లో ఇరికిస్తోంది...అక్టోబరులో బీసీలతో టిడిపి భారీ సభ:చంద్రబాబు
అమరావతి:వివిధ సందర్భాల్లో వైసిపి కుట్రపూరితంగా అల్లర్లు జరిపించి అమాయకులను కేసుల్లో ఇరికిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. శనివారం పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలంతా టిడిపి వైపు మళ్లడం చూసి వైసిపి వారిపై అక్కసు పెంచుకుంటోందని...అందుకే అల్లర్లు సృష్టించి, అశాంతి చెలరేగేందుకు కుట్రలు చేస్తోందని సిఎం చంద్రబాబు ఆరోపించారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన 'నారా హమారా-తెదేపా హమారా' సభలోనూ అల్లర్లు సృష్టించి అమాయకులైన ముస్లింలను కేసుల్లో ఇరికించడం వైసిపి నేర ప్రవృత్తికి నిదర్శనమని చంద్రబాబు అభివర్ణించారు.
పార్టీ నేతలతో...సిఎం సమావేశం
వచ్చే ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను సమాయత్తపరిచే చర్యల్లో భాగంగా టిడిపిలోని కొందరు నేతలతో సమావేశమయ్యారు. అలాగే పార్టీ, ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుని రాబోయే ఎన్నికలకు కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 5 వ తేదీన ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సిఎం చంద్రబాబు పార్టీ నేతలకు వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో వరుసగా ధర్మపోరాట సభలు, క్రైస్తవ, మైనారిటీ, గిరిజన, బీసీ సభల ను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
టిడిపి...వరుస సభల నిర్వహణ
‘బీసీలే తెదేపాకు వెన్నెముక. త్వరలో ఉత్తరాంధ్రలో బీసీల సదస్సు నిర్వహించాలి. దీనికిముందు అన్ని బీసీ కులాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి ఏం చేశాం? ఏం చేయాలన్న అంశాలపై చర్చించాలి' అని పేర్కొన్నారు. అనంతరం విజయనగరం జిల్లాలో గిరిజన గర్జన సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో జిల్లాలవారీగా పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ..."ధర్మపోరాటం సభలు మరో ఏడు నిర్వహించాల్సి ఉంది. జనవరికల్లా పూర్తి చేయాలి. ఈ నెలలో ప్రాజెక్టుల సందర్శన- జలసిరికి హారతి కార్యక్రమాలు చేపడతాం. త్వరలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలాశయాలను సందర్శిస్తా. మేనిఫెస్టోలోని అన్ని హామీలను కేవలం 50 నెలల్లోనే నెరవేర్చడం ఒక రికార్డు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తున్నాం. వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి"...అని దిశానిర్దేశం చేశారు.
కుట్రలన్నీ...వైసిపి చేసినవే
"రాజధానిలో చెరకు,అరటి తోటలు తగలబెట్టడం...తునిలో రైలు దగ్ధం చేసి నేరం అమాయకులైన కాపులపైకి నెట్టాలని చూడటం...గుంటూరులో పోలీస్స్టేషన్పై దాడి చేసి ముస్లింలపైకి నెట్టడంవంటి కుట్రలన్నీ వైసిపి చేసినవే...ఆ పార్టీ కుట్రల ట్రాక్ రికార్డు అందరికీ తెలుసు...జల్లికట్టు స్ఫూర్తి అని చెప్పి విశాఖ విమానాశ్రయంలో జగన్ చేసిన రభస అందరూ గుర్తుంచుకోవాలి...గుంటూరులో టిడిపి నిర్వహించిన మైనారిటీ సదస్సుకు నంద్యాల నుంచి వైకాపా కార్యకర్తలను పంపడమేంటి?...వైకాపా కార్యక్రమాలకు వెళ్లి టిడిపి కార్యకర్తలు ఎప్పుడైనా అల్లర్లు సృష్టించారా?...వైకాపా ఆవిర్భావం తర్వాతే ఇలాంటి పెడధోరణులు...టిడిపి కార్యక్రమాల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాల"...అని సీఎం చంద్రబాబు పార్టీనేతలకు సూచించారు.
అసెంబ్లీ సమావేశాలు...వినియోగించుకోండి
‘ఈ నెల 6 వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాల్ని టిడిపి సద్వినియోగం చేసుకోవాలి...ప్రజలపట్ల ఉన్న బాధ్యత నిర్వర్తించడంలో వైసిపి విఫలమైంది. వైకాపా సభ్యులు పార్లమెంటుకు వెళ్లరు, అసెంబ్లీకి రారు" అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. టిడిపి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామవికాసం కార్యక్రమం ఇప్పటికీ 18.4 శాతమే పూర్తవడంపై సిఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. లక్ష్యం కన్నా 20 శాతం వెనుకబడ్డామని...డిసెంబరుకల్లా అన్ని గ్రామాలు, వార్డుల్లో కార్యక్రమం పూర్తి కావాలని సిఎం స్పష్టంచేశారు. గ్రామ వికాసంలో స్థానిక సంస్థల ప్రతినిధుల ప్రాతినిధ్యం బాగుందని, ఎంపీలు, జిల్లా పార్టీల అధ్యక్షుల భాగస్వామ్యం తక్కువగా ఉందని తెలిపారు. బూత్ కన్వీనర్ల శిక్షణ ఇంకా 54 శాతం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఓటర్ల నమోదుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధ పెంచాలని సూచించారు.