వనజాక్షి టు రిషికేశ్వరి: 'అంతా అమాయకులే'.. నెట్లో పోస్ట్ హల్చల్
విజయవాడ: ఏపీలో పలు సంఘటనల పైన సామాజిక అనుసంధాన వేదికల్లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ ప్రభుత్వం నేరస్తుల పైన కఠిన చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు చెబుతుండగా, ప్రతిపక్ష నేత జగన్తో పాటు పలువురు వివిధ అంశాలను ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నెటిజన్లు గత పద్దెనిమిది నెలల పాలన పైన తమదైన రీతిలో స్పందిస్తున్నారు. 'అందరూ అమాయకులే' అంటూ ఒకరు పెట్టిన పోస్ట్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో హల్చల్ చేస్తోంది.
వనజాక్షి కేసులో చింతమనేని ప్రభాకర్ అమాయకుడని, రిషికేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబురావు అమాయకుడని, కారు రేసు కేసులో విద్యార్థి మృతి చెందితే బొండా ఉమ తనయులు అమాయకులని, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి అమాయకులను అందులో పేర్కొన్నారు.
అలాగే, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్న మంత్రి పీతల సుజాత అమాయకురాలేనని, రాజధానిలో పంట పొలాలు తగులబడితే అధికారులు అమాయకులేనని అందులో పేర్కొన్నారు.
కాగా, వనజాక్షి కేసులో ఆమె జిల్లా దాటి సరిహద్దు దాటారని, డ్వాక్రా మహిళల తరఫున ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడారని టిడిపి చెబుతోంది. రిషికేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబురావు పైన చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. రూ.10 లక్షల గురించి తనకు తెలియదని పీతల సుజాత వివరణ ఇ్చారు. రాజధానిలో పంట పొలాలు తగులబెట్టడం కుట్ర అని టిడిపి చెప్పింది.