Inside info:జగన్ -షా మీటింగ్లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్రానికి కేంద్రం నుంచి కావాల్సిన సాయంపై వినతిపత్రాలు అందజేశారు. అప్పటి వరకు ఆ సమావేశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యే నడిచింది. అనంతరం చర్చలు రాజకీయం వైపు మరలినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కొన్ని విషయాలు కోరగా అందుకు అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమిత్ షా కూడా జగన్ను పలు రాజకీయపరమైన విజ్ఞప్తులు చేసినట్లు సమాచారం.
Recommended Video
మరోసారి ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీఎం జగన్ అమిత్ షాల భేటీలో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం జగన్ పలు విన్నపాలు అమిత్ షా ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే వీటికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని సమాచారం. అంతేకాదు కొన్ని అంశాలపై ప్రధాని మోడీతో సంప్రదింపులు జరపాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మరోసారి సీఎం జగన్ ఢిల్లీకి వెళతారని సమాచారం.
కేంద్రంతో కలిసి పనిచేయాలని కోరిన షా
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ పెద్దలు పావులు ఎప్పటి నుంచో కదుపుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఆ తర్వాత అక్కడ పాగా వేయాలన్న కమలనాథులు ఆలోచనకు అడుగులు ముందుకు పడ్డాయి. ఈ ఫార్ములాను ఇప్పటికే ఉత్తరాదిన ఇంప్లిమెంట్ చేసి ఓ రకంగా సక్సెస్ అయ్యారు కూడా. ఇందుకు తాజా ఉదాహరణ బీహార్. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అమిత్ షా చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక జగన్తో భేటీ సందర్భంగా కేంద్రంతో కలసి పనిచేయాలంటూ అమిత్ షా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఎప్పటిలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంతో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో అమిత్ షా వైసీపీ మద్దతును కోరగా... అందుకు సీఎం జగన్ తప్పకుండా బిల్లులకు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
వైసీపీకి డిప్యూటీ లోక్సభ స్పీకర్ ఆఫర్
ఇక ఎన్డీయేలో చేరాలంటూ అమిత్ షా కీలక ప్రతిపాదన సీఎం జగన్ ముందు ఉంచినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ఉన్నఫలంగా వచ్చింది కాదు. గతంలో కూడా వైసీపీ ఎన్డీయేలో చేరుతోందంటూ వార్తలు వచ్చాయి. గతంలో వచ్చిన ఆఫర్పై వైసీపీ అధినేత జగన్ సుముఖత వ్యక్తం చేయలేదనే వార్తలు కూడా షికారు చేశాయి. ఇక తాజా ఆఫర్ ప్రకారం వైసీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా చెప్పినట్లు సమాచారం. గతంలో కూడా ఇదే ఆఫర్ ఇచ్చినప్పటికీ... తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని వైసీపీ నేతలు అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అయితే తాజా ప్రతిపాదనను సీఎం జగన్ ముందు నేరుగా అమిత్ షా నే ఉంచడంతో పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ఆపై తమ నిర్ణయం చెబుతామని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరోసారి మూడు రాజధానుల అంశం కూడా చర్చకు రాగా... పోలవరం పూర్తయ్యేందుకు సహకరించాలని సీఎం జగన్ అమిత్ షాను కోరడం జరిగింది.
మొత్తానికి జమిలి ఎన్నికలపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.