అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్: విచారణకు రంగంలోకి దిగిన సిట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో సిట్ రంగంలోకి దిగింది . సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొన్న క్రమంలో ఆ వ్యవహారాన్ని కూడా సిట్ విచారించనుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ల్యాండ్ ట్రేడింగ్పై సిట్ అధికారులు రంగంలోకి దిగారు .
దాడులు ప్రారంభించిన సిట్ అధికారులు
ఇక ఈ క్రమంలో ఏపీ సిట్ బృందం దాడులు ప్రారంభించింది . కంచికచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీనారాయణ ఇంటికి శనివారం ఉదయం చేరుకున్న సిట్ అధికారులు.. దాడులకు శ్రీకారం చుట్టారు. లక్ష్మీనారాయణ సమక్షంలో ఇంటిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారిని ఎవరినీ వదలబోమని , వారిని విచారించి అసలు జరిగిన అక్రమాలు వెలికి తీస్తామని కంకణం కట్టుకున్న సిట్ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది.
కంచికచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు
శుక్రవారం సాయంత్రం సిట్ అధికారులు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళిన క్రమంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో కేవలం ఇంటికి నోటీసు అంటించి తిరిగి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ఆయన పారిపోయారని ప్రచారం జరిగింది. ఇక నేడు ఉదయం ఆయన ఇంటికి వచ్చిన సిట్ బృందం తనిఖీలను ప్రారంభించింది. సిట్ అధికారుల తనిఖీల నేపథ్యంలో నన్నపనేని లక్ష్మీనారాయణ సిట్ అధికారులకు సహకరిస్తానని చెప్పారు . తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పిన ఆయన శుక్రవారం అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి వెళ్లి వచ్చానని పేర్కొన్నారు.
లక్ష్మీ నారాయణ కుమారుడి ఇంట్లోనూ సోదాలు చేసిన సిట్
విజయవాడలో నివాసం ఉంటున్న లక్ష్మీ నారాయణ కుమారుడు సీతారామరాజు ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించిన క్రమంలో ఆయన ఇంట్లో లేకపోవటంతో లక్ష్మీనారాయణ పారిపోయారంటూ ప్రచారం జరిగింది. కానీ నేడు లక్ష్మీనారాయణ సిట్ బృందం వచ్చిందని తెలుసుకున్న వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు . లక్ష్మీనారాయణ సమక్షంలోనే సిట్ బృందం తనిఖీలను కొనసాగిస్తుంది. మొత్తానికి ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. దీంతో చాలా మంది టీడీపీ నేతలు భయపడుతున్నారని సమాచారం .