తెలంగాణలో అవమానాలు, తరలాలంటే..: అశోక్ బాబు
నెల్లూరు: తెలంగాణలో వేధింపులు, అవమానాలను భరించలేక పోతున్నామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధానికి వెళ్లడానికి తాము సిద్ధమేనని, అయితే అక్కడ పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించి, ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఒకేసారి తీసుకెళ్లాలని అన్నారు. ఆదివారం నెల్లూరు ఎన్జీవో భవనంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
హైకోర్టు, సచివాలయం, శానససభలతోపాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకేసారి కొత్త రాజధానికి తరలివెళ్లడం మంచిదని ఆయన అన్నారు. రాజధానిని ఒక ప్రపంచ ప్రఖ్యాత, మోడల్ రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనను సమర్థిస్తామని, అయితే తమ దృష్టిలో రాజధాని అంటే ఒక పరిపాలనా కేంద్రమని అశోక్బాబు అన్నారు. సింగపూర్లో ఎత్తయిన భవనాలతోపాటు పరిపాలన కూడా బాగుందని, సింగపూర్లో ఉన్న పాలనా సదుపాయాలు, నాణ్యత ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. దానికి ఉద్యోగులుగా తాము కచ్చితంగా ముందుంటామని చెప్పారు.
ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి తాము రావాలంటే ప్రభుత్వం కూడా తమ బాధలను పట్టించుకోవాల్సి ఉందన్నారు. వసతితోపాటు విద్య, వైద్య, రవాణా ఇతర సదుపాయాలు కూడా కల్పించాలన్నారు. ఒక భవనం కట్టి అక్కడికి వెళ్లాలంటే ఉద్యోగులు కచ్చితంగా ఇబ్బంది పడతారని, ఉద్యోగులను ఇబ్బంది పెట్టి పని చేయించుకోవడం ప్రభుత్వ లక్షణం కాదని, అలాంటి పరిస్థితి వస్తే తాము దాన్ని ఎదుర్కొనే అవకాశం కూడా ఉందన్నారు.
హైకోర్టు, సచివాలయం హైదరాబాద్లో ఉండి, శాఖాధిపతుల కార్యాలయాలను కొత్త రాజధానికి తరలిస్తే అసౌకర్యం కలిగే అవకాశముందన్నారు. ఈ మూడు వ్యవస్థలు కూడా కొత్త రాజధానికి వచ్చే వరకూ ఇబ్బందులున్న ఉద్యోగులను హైదరాబాద్లోనే ఉంచాలని, కొత్త రాజధాని రాగానే ఉద్యోగులను వారి అంగీకారంతోనే తీసుకెళ్లాలి తప్ప ఒక రాజకీయ వ్యవస్థ కోసమో, ఇతర అవసరాల కోసమో రాజధానిని అర్ధాంతరంగా మార్చి ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తేకూడదని తాము కోరుకుంటున్నామన్నారు.
ఉద్యోగ సంఘాలతో వీటిపై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజుల్లో సీఎంను కలిసి పీఆర్సీ, హెల్త్కార్డులు, కాంట్రాక్టు కంటిజెంట్ ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిని జేఏసీ పక్షాల అడుతుతామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే తరహా ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేస్తే సంతోషిస్తామన్నారు.