కడప గడపలో జగన్ కి బంగపాటు..! బీటలు వారుతున్న వైసీపి కంచుకోట..!!
Recommended Video
హైదరాబాద్: "కాలంతో పాటు వ్యక్తుల అభిప్రాయంలో మార్పు రావడంలో తప్పులేదు" అన్నాడు ప్రముఖ తత్వవేత్త జిడ్డు క్రిష్ణమూర్తి. ప్రస్తుత రాజకీయాలకు ఈ సూత్రం అతికినట్టు సరిపోతోంది. రాకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ప్రజల అభిప్రాయాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజలు ఎప్పుడూ తన గురించి ఆలోచింపజేసుకుని స్థిరంగా ఉండేట్టు చేసుకోగలిగే వాడే నిజమైన రాజకీయ నాయకుడు. ప్రస్తుత రాజకీయాల్లో అంతటి అంకిభావంతో పనిచేసే నాయకులు అత్యంత అరుదుగా ఉంటారనుకోండి. ఇక అసలు విషయానికి వస్తే కడప జిల్లాను తన కనుసన్నలతో శాశించే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కి అదే జిల్లాలో వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. కంచుకొట లాంటి కడప జిల్లాను నిర్లక్ష్యం చేయడమే ఇందుకు నిదర్శనమని కడప గడపలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
కడప గడపలో జగన్ కు ఎదురీత..! నిర్లక్ష్యమే కారణమంటున్న ప్రజలు..!!
ఎలాగైన అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ అధినేత జగన్ ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఉన్న నియోజక వర్గాలనే కాకుండా కొత్త వాటిపై కూడా వైసీపీ జెండా ఎగుర వేయాలని ఆయన కలలు కంటున్నారు. కాని ఆయనకు కంచుకోటగా ఉన్న కడప జిల్లా రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడపలో ఇప్పుడు జగన్మోహన్రెడ్డి కి ఎదురుగాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప ప్రజల మైండ్సెట్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇందుకు జగన్మోహన్రెడ్డి వ్యవహారశైలినే కారణమంటున్నారు ఆ పార్టీ నేతలు! సొంత జిల్లాలోనే జగన్కు వ్యతిరేకపవనాలు అంత శ్రేయస్కర పరిణామాలు కావని ప్రజలు చెప్పుకొస్తున్నారు.
నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అండ..! నాలుగేళ్లలో వ్యతిరేకత..!! కారణం ఏంటి..?
నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబసభ్యులను ఆదరిస్తూ వచ్చామని, మరి వారు తమకు చేసిందేమిటని నేరుగానే ప్రశ్నిస్తున్నారు ప్రజలు. గత ఎన్నికల్లో ఒక్క రాజంపేట మినహా మిగతా తొమ్మిది స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెల్చుకుంది. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలలో అనేక సమస్యలున్నాయనీ, గెలిచిన ఎమ్మెల్యేలెవరూ ప్రజల యోగక్షేమాలను పట్టించుకున్న దాఖలాలు లేవని జనం వాపోతున్నారు. జగన్మోహన్రెడ్డి కూడా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజల కనీస అవసరాలను తీర్చలేని జగన్ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కడప సమస్యలను పరిష్కరిస్తున్న టీడిపి..! పులివెందుల ప్రజల మనసు గెలుచుకున్న బాబు..!!
సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లాపై దృష్టిసారించారు. ఆ ప్రాంత ప్రజలలో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పులివెందులలో ప్రధాన సమస్య అయిన తాగు, సాగు నీటిని చంద్రబాబు అందించారు. అలా వారి చిరకాల కోరికను నెరవేర్చారు. వైఎస్ కుటుంబం చేయలేని పని ఇప్పుడు చంద్రబాబు చేశారని ఆ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. పులివెందులకు కృష్ణా జలాలను తెప్పించడంలో సఫలీకృతులైన చంద్రబాబు కడప ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కృష్ణా జలాల తరలింపు చంద్రబాబుకు మైలేజీని ఇవ్వగా, జగన్మోహన్ రెడ్డికి నష్టాన్ని కలుగజేసింది.
కలిసొచ్చిన ఉక్కుదీక్ష..! కడపలో పాగా వేయనున్న చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో అవకాశం లభించింది. కడప ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేశ్ చేపట్టిన ఉక్కు దీక్షకు కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన రావడం టీడీపీకి బాగా కలిసివచ్చింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే, సొంత జిల్లా వాస్తవ్యుడై ఉండి జగన్ నోరు విప్పకపోవడం జనానికి విస్మయాన్ని కలిగించింది. కడప ఉక్కు కర్మాగారంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపడుతుందని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ హయంలోనే ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందన్న నమ్మకం కడప ప్రజలలో ఏర్పడింది. ఇవన్నీ జగన్ను ఆత్మరక్షణలో పడేశాయి. రాబోయే ఎన్నికల్లో కృష్ణా జలాలు, ఉక్కు ఫ్యాక్టరీ అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదంతా జగన్ స్వయంకృతాపరాధమేనని స్థానిక ప్రజానికం చర్చించుకుంటున్నట్టు సమాచారం.