ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం టూర్ లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి అవమానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి అవమానం ఎదురైంది. జగన్ పర్యటన సందర్భంగా అక్కడ ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. తన పేరు లేదంటూ కృపారాణి అలక వహించడంతో ఆమెను ఎంపీ, మాజీ మంత్రి బుజ్జగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ముఖ్యమంత్రి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న కృపారాణి ప్రోటోకాల్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం న్యాయం.. కేంద్ర మాజీ మంత్రినే మరిచిపోతారా? అంటూ అధికారులను నిలదీశారు. పేరు మరిచిపోవడమేంటంటూ నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కృపారాణి శాంతించలేదు. చివరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కృపారాణి కారువద్దకు వెళ్లి బతిమలాడినప్పటికీ కృపారాణి శాంతించక వెళ్లిపోయారు.
ప్రొటోకాల్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని కృపారాణి అన్నారు. ఇటీవలే పార్టీలో చేరిన ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి పేరు పరిశీలించారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమె ఆ పదవి చేజారిపోయింది. అయినప్పటికీ మరో మంచి పదవి ఇచ్చే ఉద్దేశంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని కృపారాణి అనుచరులు చెబుతున్నారు.
జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూరి స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్ అమ్మ ఒడికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. 40 లక్షల మంది తల్లు ల ఖాతాల్లో రూ.6595 కోట్లు జమచేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువు ఆగకూడదని, అందుకే 75 శాతం హాజరు తప్పనిసరి చేశామని, పాఠశాలలు, టాయిలెట్స్ నిర్వహణ కింద కాసింత సొమ్మురూ.2వేలు వసూలు చేస్తుంటే కొంతమంది విమర్శిస్తున్నారన్నారు.