రాజధాని ఆందోళనలపై అధికార వర్గాల నిఘా : ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం
సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్ను ముట్టాయి .అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. గత ఐదు రోజులుగా గుంటూరు జిల్లా మందడం, తుళ్లూరు కేంద్రంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి నుండి రాజధాని ప్రాంత రైతులు ఆమరణ నిరాహార దీక్షలకు కూడా పిలుపునిచ్చారు. అయితే రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న ఈ ఆందోళనల వెనుక ఎవరున్నారనే దానిపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి వర్గాలు ఆరా తీస్తున్నాయి.
రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలపై నిఘావర్గాల ఆరా
రాజధాని ప్రాంత రైతులు సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఆందోళనలో ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వారు ఆందోళనలు చెయ్యరని, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ అలజడులకు శ్రీకారం చుట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ లతో నిరసనలకు దిగుతున్నారని వైసీపీ మంత్రులే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక టీడీపీ నేతలే వెనకుండి నడిపిస్తున్నారా అన్న కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
రాజధాని రైతులకు బాసటగా టీడీపీ .. నిఘా వర్గాల అంచనా
ముఖ్యంగా టీడీపీ నేతలే రాజధాని రైతులను ఆందోళనలకు ప్రేరేపిస్తున్నారన్న వార్తలు వస్తున్న తరుణంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు నేరుగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయ పలుకుబడి ప్రయోగించి ఆదివారం ప్రత్యేకంగా విద్యార్థులను కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇచ్చేలా ప్రేరేపించడం వంటి చర్యలు , నేడు ఏకంగా చంద్రబాబు రాజధాని రైతులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననుండటం వెరసి టీడీపీ రాజధాని రైతులను ఆందోళనల దిశగా ప్రోత్సహిస్తుంది అని నిఘా వర్గాలు అంచనాకు వచ్చినట్టు సమాచారం .
నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత పెంపు .. పోలీసులు అప్రమత్తం
అమరావతి ప్రాంతంలో తాజా పరిణామాలపై నిఘా వర్గాలు అందిస్తున్న సమాచారంతో మరింత ఆందోళనలు కొనసాగే అవకాశం ఉందన్న నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు . రాజధాని ప్రాంతంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతం ఇద్దరు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 32 మంది ఎస్సైలు, 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం అంటున్న పోలీసులు
అంతే కాదు ప్రజలను రెచ్చగొడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోమని చెప్తున్న అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అవసరమైతే అమరావతికి అదనపు బలగాలు తరలిస్తామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. శాంతియుత నిరసనలు తెలియజేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అమరావతిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.