నెల్లూరులో కుండపోత: ఆ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
నెల్లూరు: గత ఏడాది నవంబర్లో వరుస అల్పపీడనాల ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాలను భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. రాయలసీమ వరప్రదాయినిగా చెప్పుకొనే పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని నదులు పొంగిపొర్లాయి. కరవు ప్రాంతంగా పేరున్న రాయలసీమలో ఇదివరకెప్పుడూ లేని విధంగా నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి.
ఇప్పుడు తాజాగా మళ్లీ అవే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈస్టర్న్ లైస్ వల్ల నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీని ప్రభావం ప్రత్యేకించి- నెల్లూరు జిల్లాపై తీవ్రంగా పడింది. నెల్లూరు నగరంలో తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి. ఆదివారం రాత్రి చిరు జల్లులతో వర్షం కురవడం ప్రారంభమైంది. రాత్రంతా అడపాదడపా వర్షం పడుతూనే ఉంది. తెల్లవారు జాము నాటికి తీవ్రమైంది. సుమారు రెండున్నర గంటలపాటు వర్షం దంచి కొట్టింది.
నెల్లూరు రామలింగాపురం అండర్ పాస్లో వరద నీరు చేరడంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు సిటీలోని పలు లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నెల్లూరు దక్షిణ ప్రాంతంలోని నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేటల్లో వర్షం కురిసింది. జిల్లా ఉత్తర ప్రాంతంలోని కావలిలోనూ వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి.
జిల్లాలోని రేణిగుంట, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడుల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అటు ప్రకాశం జిల్లాలోనూ వర్షం కురిసింది. కడప జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో తేలికపాటి వర్షం కురిసింది. తాజాగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో సగటు వర్షపాతం మెరుగుపడింది. ఈ నెల 16వ తేదీ వరకు 18.3 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా రికార్డయినట్లు ఏపీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.
గత ఏడాది ఇదే సమయానికి 7.3 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కాగా.. ఈ సారి అది రెట్టింపయింది. ఇప్పటికే నీటి ప్రాజెక్టులన్నీ నిండాయని, ఈ సీజన్లో వ్యవసాయ అవసరాలకు ఎలాంటి నీటి కొరత ఉండబోదని అంచనా వేస్తోన్నారు. గత ఏడాది నవంబర్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఈ వర్షాకాలంలోనూ ఉండొచ్చని భావిస్తున్నారు. దాదాపుగా అన్ని నీటి ప్రాజెక్టులు గరిష్ఠ నీటిమట్టాన్ని అందుకున్నాయని చెబుతున్నారు.