ఈ పాపం ఎవరిది?: కడపలో ఇంటర్ విద్యార్ధినుల ఆత్మహత్య, జగన్ పరామర్శ..!
హైదరాబాద్: వైయస్సార్ కడప జిల్లా నగర శివార్లలో విద్యార్ధినుల ఆత్మహత్యపై కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. నగరంలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఉన్న ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్ధినిలు సోమవారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు మృతదేహాలకు కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే విద్యార్ధి సంఘాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్ధినుల ఆత్మహత్య సంఘటనతో కాలేజీ యాజమాన్యం రెండు రోజులు పాటు సెలవులు ప్రకటించింది. అంతేకాదు ఈ ఆత్మహత్య ఘటనపై విచారణకు ఇద్దరు అధికారులను జిల్లా ఎస్పీ నియమించారు. సోమవారం సాయంత్రం ఒక గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కడప నగరం ఓం శాంతినగర్కు చెందిన మాలేపాడు సుబ్బారావు కుమార్తె నందిని (16), సిద్ధవటం మండలం భాకరాపేట లెవెన్త్ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చవ్వా బాలకృష్ణారెడ్డి కుమార్తె మనీషా (16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.
ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన వీరు కడప శివారులోని ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో చేరారు. ఇదే క్యాంపస్లో హాస్టల్లో ఉంటూ 103వ గదిలో కలిసి ఉంటున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు టీ బ్రేక్ తర్వాత హాస్టల్ గదిలోకి వెళ్లారు.
కొంతసేపటి తర్వాత మిగిలిన విద్యార్ధినిలు వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించారు. కళాశాల సిబ్బంది వచ్చి చూసే సరికే మృతి చెందారు. మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని టీచర్ల వేధించడం వల్లే మనీషా, నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
విద్యార్ధినిల దేహాలపై గాయాలున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలు ఆత్మహత్య చేసుకునేంతటి పిరికి వారు కాదని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్ధినిల ఆత్మహత్య ఘటనతో బంధువులు కాలేజీలోని ఫర్నీచర్, ద్వారం, కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు.
విద్యార్ధినుల ఆత్మహత్య ఘటనతో కడప నగరం అట్టడుకుతుంది. రిమ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్ధిని వద్ద ప్రేమ లేఖ దొరికిందన్న ఎస్పీ వ్యాఖ్యలపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధిని ఒంటిపై గాయాలున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు.
జగన్ వచ్చేంతవరకు మృతదేహాలను ఇక్కడే ఉంచాలని బంధువులు అంటున్నారు. మరోవైపు విద్యార్ధిని వద్ద ప్రేమ లేఖ దొరికిందన్న ఎస్పీ వ్యాఖ్యలకు గాను ప్రేమ లేఖను తమకు చూపించాల్సిందేనంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
కేసును పక్కదారి పట్టించేందుకు ఎస్పీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరికాసేపట్లో రిమ్స్ ఆసుపత్రిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహాన్ రెడ్డి సందర్శించనున్నారు. చనిపోయిన విద్యార్ధి కుటుంబాలను, తల్లిదండ్రులను పరామర్శించనున్నారు.