ఎంఆర్ కాలేజీలో ఇంటర్ విద్య నిలిపివేత: ప్రభుత్వ కాలేజీలో మంత్రి బొత్స
విజయగనరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ కాలేజీలో ఇంటర్ ిద్యను నిలిపివేత చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డుతోపాటు ప్రభుత్వానికి మాన్సాస్ ట్రస్ట్ తెలియేసింది.
ప్రభుత్వ కాలేజీ పరిశీలించిన మంత్రి బొత్స
ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రత్యామ్నాయంగా విజయనగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సోమవారం పరిశీలించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఇంటర్ బోర్డ్ అధికారులతో కలిసి కళాశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య, ఖాళీలు, అధ్యాపకుల అవసరం తదితర వివరాలున మంత్రి బొత్స సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు నష్టపోకుండా..
ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ఎంఆర్ కాలేజీలో ఇంటర్ విద్యను మూసివేస్తున్నట్లు మాన్సాస్ ట్రస్ట్ ప్రభుత్వానికి తెలియజేసిందని మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోకుండా విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అవన్నీ కుటుంబ తగాదాలే..
ఇక మాన్సాస్ ట్రస్ట్ వివాదాలపైనా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అవన్ని కుటుంబ తగాదాలని చెప్పారు. ఈ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు. ఆస్తులు అన్యాక్రాంతం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Recommended Video
ప్రైవేటుపరం చేయొద్దటూ.. అశోక్ గజపతిరాజు, ఊర్మిల గజపతిరాజు
కాగా, ఎంఆర్ కాలేజీని ప్రైవేటు పరం చేసేందుకు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ విద్యను మూసివేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఊర్మిళ కూడా ఎంఆర్ కాలేజీ ప్రైవేటుపరం చేయడంపై స్పందించారు. ఎంతో చరిత్ర కలిగిన మహారాజా కళశాలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు ఊర్మిళ. తన తాత, తండ్రి పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజుపై ఆమె మండిపడ్డారు. ఎంఆర్ కళాశాలలో చదువుకున్నవారు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఊర్మిళ తెలిపారు. ఇలాంటి విద్యాసంస్థను ప్రైవేటుపరం చేయడాన్ని తాము ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని ఊర్మిళ ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.