అమితాబ్ చెప్పినా చిరంజీవి వినలేదు: ఇక రాజకీయాలకు..అంతేనా : మెగాస్టార్ మనసులో మాట..!
మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఒక్కోక్కటిగా బయట పడుతున్నారు. తన మనసులోని మాటలను వెల్లడిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక చిత్రీకరణతో భారీగా తన సినిమా సైరా ను ప్రమోట్ చేస్తున్న చిరంజీవికి ఇప్పుడు రాజకీయంగా తన అనుభవాలు...ఇప్పటి వరకు బయట పెట్టని అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక..బిగ్ బీ అమితాబ్ సైతం రాజకీయాల పైన చిరంజీవికి ఏం చెప్పిందీ ఓపెన్ అయ్యారు. తాను అప్పుడు అమితాబ్ మాటలు వినకపోవటం వలనే తరువాతి కాలంలో బాధ పడాల్సి వచ్చిందని చిరంజీవి సైతం అంగీకరించారు.
రాజకీయాల పట్ల ఆయన ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చిరంజీవి మాటలే స్పష్టం చేస్తున్నాయి. సైరా ప్రమోషన్ లో బీజగా ఉన్న చిరంజీవి తాను ప్రజారాజ్యం ఏర్పాటు.. కాంగ్రెస్ లో విలీనం..తాను రాజకీయాలకు దూరం అవ్వటం వంటి అంశాల పైన సందర్బానుసారం స్పందిస్తున్నారు. ఇక, అమితాబ్ సమక్షంలో చిరంజీవి చేసిన పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అమితాబ్ అప్పుడు చిరుకు ఏం చెప్పారు..
సైరా సినిమాలో చిరంజీవితో పాటుగా అమితాబ్ కూడా కనిపిస్తారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వారిద్దరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో చిరంజీవి రాజకీయ ప్రస్తానం గురించి ప్రశ్నలు ఎదురువుతున్నాయి. ఆ సమయంలో నాడు ఎదురైన పరిస్థితులు..వాస్తవాలను బయట పెడుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అంశం మీద అమితాబ్ తో చర్చలు జరిగాయి. ఊటీలో ఒక సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో కలిసి పని చేసానని..అప్పటి నుండి ఇద్దరి మద్య మంచి స్నేహం ఏర్పడిందని అమితాబ్ చెప్పుకొచ్చారు. తాను అనేక సలహాలు ఇస్తుంటానని, కాని చిరంజీవి పాటించరని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాను చిరంజీవి రాజకీయ ఎంట్రీ గురించి సైతం సలహా ఇచ్చానని బిగ్ బీ గుర్తు చేసారు. రాజకీయాలలోకి వెల్లవద్దని చెప్పానని అమితాబ్ తన పక్కనే ఉన్న చిరంజీవిని చూపిస్తూ ఆవేదనగా చెప్పుకొచ్చారు.
నిజమే..తరువాత బాధపడాల్సి వచ్చింది...
అమితాబ్ తాను చెప్పిన సలహా వినలేదని..చెప్పినా వినకుండా రాజకీయాల్లోకి వెళ్లారని వివరించారు. దీనికి స్పందనగా చిరంజీవి సైతం అవుననే విధంగా స్పందించారు. తనకు అమితాబ్ రాజకీయాల్లో వద్దని చెప్పిన మాట నిజమేనని..అయితే కొందరి ఒత్తిడి..సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆ తరువాత వాస్తవాలు తెలుసుకొని బాధ పడాల్సి వచ్చిందని మనసులో మాట బయట పెట్టారు. రెండు రోజుల క్రితం మరరో ఇంటర్వ్యూలోనూ చిరంజీవి ఇదే రకమైన వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయాల్లోకి వచ్చే వరకూ సుప్రీం హీరోగా ఉన్నానని..రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తన లాంటి సున్నిత మనస్తత్వం ఉన్న వారు రాజకీయాలకు పనికి రారనే విషయాన్ని గుర్తించానని స్పష్టం చేసారు. డబ్బు ప్రభావం కారణంగానే నాడు తాను..తాజాగా జరిగిన ఎన్నికల్లో పవన్ సొంతి జిల్లాలోని సొంత నియోజకవర్గాల్లో ఓడిపోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తమను ఓడించటానికి ప్రత్యర్ధులు భారగా డబ్బు ఖర్చు చేసారని వివరించారు. దీని పైన చర్చ సాగుతుండగానే తాజాగా ఈ వ్యాఖ్యలు చేసారు.
ఇక రాజకీయాలకు చిరు దూరమేనా..
చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తిన్నారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పని చేసారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తరువాత క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తమ్ముడు పవన్ జనసేన పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి దిగినా..నాగబాబు మినహా మెగా ఫ్యామిలీ ఎవరూ ఆయనకు రాజకీయంగా అండగా నిలవలేదు. అదే సమయంలో వ్యతిరేకంగానూ మాట్లాడలేదు. పవన్ ఎన్నికల్లో ఓటమి గురించి తొలిసారి చిరంజీవి స్పందించారు. డబ్బు కారణంగానే తాము ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సైరా ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఎంత జోష్ గా ఉన్నారో..రాజకీయ అంశాలను ప్రస్తావించే సమయంలో మాత్రం అంతే ఆవేదనతో కనిపిస్తున్నారు. దీని ద్వారా చిరంజీవి ఇక సినిమాల మీదనే ఫోకస్ చేస్తారనే అభిప్రాయం కలుగుతోంది. రాజకీయాలకు ఇక చిరంజీవి దైరమైనట్టేననే అంచనాలు వినిపిస్తున్నాయి.