'వైఎస్ కంటే జగన్ రాజకీయాలే శక్తివంతం',వైఎస్ కు సీఎం పదవి అందుకే లేట్!
హైదరాబాద్ : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీకి ఇచ్చాక.. రోజు రోజుకు రాటుదేలాలే గానీ ఢీలా పడే పరిస్థితి ఉండకూడదు. మాస్ లీడర్ గా ఎదగాలన్నా.. జనంలో ఫాలోయింగ్ పెంచుకోవాలన్నా.. ప్రజలను ఆకట్టుకునే నిర్ణయాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ ఫార్మూలాను విస్మరిస్తే.. ప్రజల్లోను ఆయా నేతల రాజకీయ ప్రభ త్వరగా కనుమరుగవడం ఖాయం.
ఇప్పుడీ విషయాలన్ని ఎందుకంటే.. రాజకీయాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన పలు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దివంగత సీఎం వైఎస్ రాజకీయాలను, ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ రాజకీయాలను ప్రస్తావిస్తూ.. ఇద్దరి రాజకీయాలకు మధ్య ఉన్న తేడాను వివరించారు అంబటి.
రాజకీయాల్లో తలపండిన వ్యక్తిగా పేరు గాంచిన వైఎస్ ను.. ఇప్పుడిప్పుడే అధికారం దిశగా అడుగులేస్తోన్న జగన్ కు మధ్య పోలిక తీసుకురావడమే పొరపాటు అన్న తరహాలో వ్యాఖ్యానించారు అంబటి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఇద్దరి రాజకీయాలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని గమనించాలని సూచించిన ఆయన.. తొలినాళ్లలో వైఎస్ పనితీరును, ప్రస్తుత జగన్ పనితీరును పోల్చి చూడాలే తప్ప, వైఎస్ అంతిమ దశ రాజకీయాలను జగన్ తొలినాళ్ల రాజకీయాలతో పోల్చి చూడడం సరికాదని అన్నారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితం ద్వారా వైఎస్ అపార అనుభవాన్ని గడించారని చెప్పుకొచ్చారు అంబటి. అయితే 'తొలినాళ్లలో మాత్రం వైఎస్ రాజకీయాలు కొంత బలహీనంగానే సాగాయని చెప్పిన అంబటి.. అందుకు భిన్నంగా జగన్ రాజకీయం మాత్రం ప్రారంభ దశలోనే శక్తివంతంగా మారిందన్నారు'. వైఎస్ అంత వయసు వచ్చే సరికి జగన్ లోని అద్భతమైన లీడర్ జనం ముందుంటాడని కితాబిచ్చారు.
ఓపిక విషయంలోను వైఎస్ కంటే, జగన్ కే ఎక్కువ ఓపిక అని తెలిపారు అంబటి. జగన్ ప్రసంగాల్లోను, మాటల్లోను నాన్చుడు ధోరణి ఉండదని, ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకుంటారని, ఐదు నిముషాలు మాట్లాడినా క్వాలిటీగా మాట్లాడగలరని వివరించారు. ఇక వైఎస్ వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడానికి వ్యక్తిగతంగా నష్టపోయినా సరే వైఎస్ మాత్రం మాటకే కట్టుబడి ఉండేవారని చెప్పారు.
వైఎస్ ఓ కల్మషం లేని వ్యక్తి అని చెప్పిన అంబటి, వంగవీటి రంగా విషయంలో వైఎస్ అండగా నిలబడ్డ విషయాన్ని గుర్తు చేశారు. 'వ్యక్తిగతంగా ఎక్కువ ఫాలోయింగ్ నేతలను సీఎం హోదాలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ ఎప్పుడూ ఇష్టపడలేదని, ఆ కారణంగానే వైఎస్ చాలా కాలం సీఎం పదవికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందన్నారు'.
అప్పట్లో.. 2004,2009 ఎన్నికల సమయంలో తనను పోటీ చేయాలని వైఎస్ కోరినా తానే సున్నితంగా తిరస్కరించానని చెప్పారు అంబటి. అయితే ఎలాంటి పదవి లేకపోయినా వైఎస్ మాత్రం తనకు చాలా గౌరవమిచ్చేవారని అన్నారు. 1999లో అధికారం కాంగ్రెస్ పక్షానిదే అని భావించినా.. జనం తీర్పు మరోలా వచ్చిందన్నారు అంబటి. అయితే ఆ తర్వాతి ఎన్నికల్లో వైఎస్ గెలిచిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి.. వచ్చే ఎన్నికల్లో జనం కూడా జగన్ కు అధికారాన్ని కట్టబెడుతారన్న ధీమా వ్యక్తం చేశారు.