వైసీపీలో దగ్గుపాటికి పొగ పెట్టారా ? రామనాధం రీ ఎంట్రీ తో పర్చూరులో ఆసక్తికర చర్చ
ప్రకాశం జిల్లా పర్చూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత ఎన్నికల ముందు వైసీపీలోకి నందమూరి అల్లుడు,చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఎంట్రీ ఇవ్వడం తో పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరిన రామనాథం ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరారు. ఒకప్పుడు వైసీపీ నేత అయిన రామనాథం ను జగన్ తిరిగి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. దీంతో ఎన్నికల సమయంలో ఉప్పు నిప్పులా రగిలిపోయిన, ఒకరినొకరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకున్న నాయకులు ఇద్దరూ ప్రస్తుతం వైసీపీ లోనే ఉండటంతో పర్చూరు నియోజక వర్గంలోఆసక్తికర చర్చ జరుగుతోంది .
ఏ విద్యార్హత ప్రామాణికం .. మాకు న్యాయం చెయ్యండి.. గ్రామ సచివాలయ బాధిత ఉద్యోగార్ధుల ఆందోళన
గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గుపాటి
గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు .అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీలోకి తీసుకోవడంతో అసహనం వ్యక్తం చేసి పార్టీ కోసం కీలకంగా పనిచేసిన రామనాథం గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఇక టిడిపి అభ్యర్ధి తరఫున ప్రచారం చేసిన ఆయన టిడిపి విజయం కోసం ఎంతగానో కృషి చేశారు. ఫలితంగా టిడిపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఏలూరు సాంబశివరావు ఎన్నికల్లో విజయం సాధించారు. దగ్గుబాటి ఘోరంగా ఓటమిపాలయ్యారు.
దగ్గుపాటి అంటే అసలు గిట్టని రామనాధం వైసీపీలోకి రీ ఎంట్రీ
ఇక తాను ఓడిపోయినా, తాను ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిందనుకుంటే, తాజా పరిణామాలు ఆయనను పొమ్మనలేక పొగ పెట్టినట్లు గా తయారయ్యాయి. ఎన్నికలకు ముందు తనని వ్యతిరేకించి పార్టీ నుండి వెళ్లిపోయిన రామనాథం తిరిగి వైసీపీలో చేరడంతో ఆయన బాధ అంతా ఇంతా కాదు. పర్చూరు నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తనను అడుగడుగునా వ్యతిరేకించిన ప్రత్యర్ధిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుతం ఆయన రగిలిపోతున్నారు అని సమాచారం.
గాథలో పర్చూరు ఇంచార్జ్ గా రామనాధం
ఇక రామనాథం రీ ఎంట్రీకి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహకరించినట్లు గా తెలుస్తోంది. ఇక పార్టీలోకి వచ్చిన రామనాథం వైసిపి బలోపేతం కావడానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వైసీపీ కీలక నేతగా, నియోజకవర్గ ఇన్చార్జి గా పనిచేసిన రామనాధం రీ ఎంట్రీ ఇవ్వడం తో తన పరిస్థితి ఏంటి అన్నదానిపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అయితే, రామనాథం టిడిపిలోకి వెళ్లారు.. తిరిగి వైసిపిలోకి వచ్చారు. అంతా బాగానే వుంది. కానీ పర్చూరులో తనను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించి, చివరికి ఓడించిన రామనాథంను తిరిగి పార్టీలో చేర్చుకోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం అధిష్టానం తీరు పట్ల అలక వహించారు.
పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న దగ్గుపాటి
తన కొడుకును వెంటబెట్టుకుని, పర్చూరు మొత్తం తిరుగుతూ, భవిష్యత్ నాయకుడిగా ప్రచారం చేసి, వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో, తనకు ప్రత్యర్థిలాంటి రామనాథంను పార్టీలో చేర్చుకోవడమేంటని ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. అయితే పర్చూరు వైసీపీ శ్రేణుల్లో మాత్రం రామనాథం రీ-ఎంట్రీతో కొత్త చర్చ జరుగుతోంది. రామనాథం రీ ఎంట్రీకి దగ్గుబాటి తీరే కారణమని చర్చించుకుంటున్నారు.
పొమ్మనలేక పొగ పెట్టారని పర్చూరు పార్టీ శ్రేణుల్లో చర్చ
ఆయనకు పొమ్మనలేక పొగ పెట్టారని వైసీపీ శ్రేణుల్లో అంతర్గత చర్చ మొదలైంది. ఇన్ఛార్జీగా దగ్గుబాటి ఉన్నప్పటికీ, రామనాథంను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడానికి దగ్గుబాటి వైఖరే కారణమని భావిస్తున్నారు. అధికారులపై అజమాయిషీ చేయటం, తనకు తెలీకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏదీ జరగడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలు దగ్గుబాటిపై ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో ఓటమి, ఆయన నియంతృత్వ పోకడ పర్చూరులో పార్టీకి దెబ్బ అని భావించిన నేపథ్యంలోనే రామనాథం ను తిరిగి పార్టీలోకి చేర్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇన్ని ఇబ్బందుల మధ్య వైసీపీ లోనే కొనసాగుతారా లేక భార్య పురంధరేశ్వరి సహకారంతో బిజెపి బాట పడతారా అన్నది వేచి చూడాలి.