ఆసక్తికరం:ఉప్పు-నిప్పులాంటి చిరకాల ప్రత్యర్థులు...పక్కపక్కనే!ఎక్కడ...ఎవరంటే?
గుంటూరు:ఒకప్పుడు రాజకీయ నేతలు పార్టీలతో సంబంధం లేకుండా తమ విభేదాలను కేవలను పాలిటిక్స్ కే పరిమితం చేసి పలకరింపుల్లో హుందాతనం కనబరిచేవారు. అయితే ఇటీవలి కాలంలో ఒకే పార్టీలోని నేతల మధ్యే సఖ్యత కొరవడితే రచ్చ రచ్చ చేస్తూ వార్తల్లో కెక్కడం సర్వసాధారణమవుతోంది.
అలాంటిది తమ ప్రత్యర్థి పార్టీలోని నేతల పట్ల వీరి వైఖరి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఇక వీరు అధికార- ప్రతిపక్షపార్టీలకు చెందినవారైతే... అందులోనూ వీళ్లు చిరకాల ప్రత్యర్థులైతే...వాళ్లిద్దరూ ఎప్పుడైనా...ఎక్కడన్నా ఎదురెదురు పడితే పరిస్థితి ఎంత వేడిగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే వారిద్దరూ పౌరుషానికి పెట్టింది పేరైన పల్నాడుకు చెందిన నేతలయితే...ఇక పరిస్థితి ఇంకెంత ఉద్రిక్తంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు...కానీ అక్కడ మాత్రం అలా జరగలేదు?...ఇంకోలా జరిగింది....అందుకే అది వార్త అయింది. మరైతే అక్కడేం జరిగిందంటే?...
చిరకాల ప్రత్యర్థులు...ఒకే చోట
గురజాల టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు...అదే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అనుకోకుండా ఒకే చోట ఎదురుపడ్డారు. సుదీర్ఘకాలంగా ఒకరితో ఒకరు తలపడుతూ చిరకాల ప్రత్యర్థులైన వీరు ఒకే చోట...ఇంకా చెప్పాలంటే ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. అయితే అక్కడ అందరూ ఊహించినట్లు వీరిద్దరూ థుమథుమలాడుకోలేదు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు... చక్కగా పలకరించుకున్నారు...కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తరువాత కబుర్లు కూడా చెప్పుకుకున్నారు.
అందరిలోనూ...ఆసక్తే
ఈ దృశ్యాన్ని అక్కడవున్న ప్రతి ఒక్కరూ ఆద్యంతం ఆసక్తిగా గమనించారు. ఇంతకూ గుంటూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి అతి అరుదైన ఈ దృశ్యానికి దుర్గి మండలం ఓబులేశునిపల్లె వేదికగా మారింది. ఆదివారం మృతి చెందిన నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్యకు నివాళులర్పించడానికి సోమవారం వారిద్దరూ ఓబులేశునిపల్లెకు వచ్చిన సందర్భంగా ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మాజీ ఎంపీ కోట సైదయ్య భార్య సీతమ్మను పరామర్శించే క్రమంలోనే యరపతినేని, జంగా పరస్పరం తారసపడ్డారు.
యరపతినేని...చొరవ
ముందుగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మాజీ ఎంపీ కోట సైదయ్య భార్య సీతమ్మను పరామర్శించేందుకు ఆమె ఉన్న గదిలోకి వెళ్లగా...కొంతసేపటికే ఆమెని పలకరించేందుకు జంగా కృష్ణమూర్తి వచ్చారు. దీంతో అప్పటికే అక్కడ ఉన్న ఎమ్మెల్యే యరపతినేని వైసిపి నేత జంగా రాకను చూసి...రండి...రండి అంటూ ఆహ్వానం పలికారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు వేశారు. బాగానే ఉందని జంగా కూడా బదులిచ్చారు. జంగా కృష్ణమూర్తి ఇటీవలే అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన యోగక్షేమాలు విచారిస్తూ ఎమ్మెల్యే యరపతినేని మరికొన్ని ప్రశ్నలు అడిగారు.
ఇరుపార్టీల్లో...చర్చనీయాంశం
పార్టీ కార్యక్రమాల కోసం రాష్ట్రం అంతటా పర్యటిస్తున్నారా అని అన్నారు. ఆ తదుపరి సైదయ్య భార్యను జంగాకు పరిచయం చేశారు. జంగా కూడా ఆమెను పరామర్శించారు. ఉప్పు, నిప్పులా ఉండే ఈ ఇద్దరు నేతలు అంత ప్రశాంతంగా పలకరించుకోవడం, మాట్లాడుకోవడం అధికార-ప్రతిపక్ష పార్టీల శ్రేణులు ఆసక్తిగా తిలకించారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల అసెంబ్లీ స్థానం వైసిపి నుంచి జంగాకు దక్కడం కష్టమేనంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార-ప్రతిపక్ష పార్టీలకు చెందిన యరపతినేని, ఆయన చిరకాల ప్రత్యర్థి జంగా కలయికపై రెండు పార్టీల్లోనూ చర్చానీయాంశంగా మారింది.