అనంత కియా చుట్టూ ఆసక్తికర రాజకీయం..! అప్పుడు టీడిపి ఇప్పుడు వైసీపి నేతల దందా బాగోతం..!!
అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వారిని ఊరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా కియా పరిశ్రమ చేరువలో ఉన్న భూములను సొంతం చేసుకోవాలని, లేదా వాటా దక్కించుకోవాలని ప్రస్తుత రాజకీయ నేతలు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వారు పోయారు.. వీరొచ్చారు. అప్పుడు వారు కారుచౌకగా కొన్న భూములపై.. ఇప్పుడు వీరు కన్నేశారు. ప్రస్తుతం వారు భాగస్వామ్యానికి అంగీకరించకుంటే.. ప్రభుత్వంతో భూసేకరణ జరపాలని వీరు జోరుగా పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఆ ఇరువర్గాల వారు ఎవరు? ఆ భూములెక్కడివి? వాటి స్వాధీనానికి కొనసాగుతున్న ప్రయత్నాలు ఎందాకా వచ్చాయి? వివరాలు తెలియాలంటే అనంతపురం జిల్లాపై ఓ లుక్కేయాల్సిందే..!
Recommended Video
అనంత రాజకీయం రసవత్తరం..! కియా చుట్టూ తిరుగుతున్న నేపథ్యం..!!
'అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ ఉన్నవారే నలిగి చచ్చారు' అన్న చందంగా ఉంది అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ చుట్టూ ఉన్న భూ యజమానుల పరిస్థితి. సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నా నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే ఆలోచిస్తారు. ఇందుకు ఏ పార్టీకి చెందిన ప్రభుత్వమైనా అతీతం కాదు. నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు, బీజేపీ నాయకులతో కలిసి కియా కార్ల పరిశ్రమ చుట్టు భూములను కారుచౌకకు కొనుగోలు చేశారట. ప్రస్తుతం ఈ భూముల ధరలు చుక్కలను అంటుతుండటంతో.. వైసీపీకి చెందిన నేతల కన్ను వాటిపై పడిందన్న ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది.
ఊరిస్తున్న భూములు..! రంగంలో దిగుతున్న నేతలు..!!
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో కియా కార్ల పరిశ్రమ స్థాపిస్తారనే విషయం తెలియగానే.. అప్పట్లో టీడీపీ పెద్దలు జాగ్రత్తపడ్డారట. నాడు ఆ పరిశ్రమ ఏర్పాటు ఎక్కడ కానుందో పక్కాగా తెలుసుకుని.. ఆ ప్రాంతం చుట్టుపక్కల సుమారు 15 వందల ఎకరాల వరకు భూములను కొనుగోలు చేశారట. ఎకరా భూమికి ఆరు లక్షల నుంచి 11 లక్షల రూపాయల వరకు వెచ్చించారని టాక్. ప్రస్తుతమిక్కడ ఎకరం భూమి 50 లక్షల నుంచి కోటిన్నర వరకూ ధర పలుకుతోంది. కియా పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంసిద్ధులవగా.. నాడు ప్రతిపక్షంలోని వైసీపీ నేతలు కొందరు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుమ్మెత్తిపోశారు.
భూముల క్రయవిక్రయాల్లో లోపాలు..!నిగ్గు తేల్చే పనిలో అదికార పార్టీ నేతలు..!!
ప్రస్తుతం వైసీపీ అధికారంలో కొనసాగుతోంది. అయితే ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి అందులోనే ఉంటూ డబ్బులు ఖర్చు పెట్టుకున్నవారిలో కొందరు.. ఇప్పుడు జేబులు నింపుకునే పనిలో పడ్డారట. ఇందులో భాగంగా కియా కార్ల పరిశ్రమ చుట్టూ ఉన్న భూములపై కన్నేశారని ప్రచారం జరుగుతోంది. విలువైన భూములను కారుచౌకగా కొని కోట్ల రూపాయలకు అమ్ముతున్న విషయాన్ని గమనించిన వైసీపీ నేతలు.. వాటిలో పాగావేయాలని పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. టీడీపీ నేతలతో కుదిరితే వాటాలు అడిగే పరిస్థితి ఉందట. లేకపోతే ప్రభుత్వంతో భూసేకరణ జరిపే విధంగా ఎత్తులు వేస్తున్నారన్నది లోకల్ టాక్.
అవతవకలపై వైసీపి కన్ను..! టీడిపి నేతల వ్యవహారం పై నజర్..!!
అనంతపురం జిల్లాకు తలమానికంగా మారిన కియాకు అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కంపెనీ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. అయితే భూములు దగ్గరలో లేకపోవడంతో సోమందేపల్లి ప్రాంతానికి కొన్ని అనుబంధ పరిశ్రమలను తరలించాలని వారు నిర్ణయించారు. అక్కడ కొందరు టీడీపీ నేతలు బినామీ పేర్లతో కొనుగోలు చేసిన వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంటే.. మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ చుట్టూ ఉన్న భూముల వ్యవహారం ఒక ప్రహసనంగా మారింది. ఈ పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.