లోకేశ్ నియోజకవర్గం- నిమ్మగడ్డ రమేష్ స్వగ్రామం : వెనుకబడిన వైసీపీ : జనసేన మద్దతు కీలకంగా..!!
ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అసలు ఏడు జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీ కూడా టీడీపీకి దక్కకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందులో భాగంగా. .టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటుగా స్వగ్రామం నారావారి పల్లెలోనూ వైసీపీ గెలుపొందింది. ఇక, టీడీపీ ప్రముఖులు అచ్చెన్నాయుడు తో సహా మాజీ మంత్రుల సొంత నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. అయితే, ఇప్పుడు లోకేశ్ నియోజకవర్గం లోని ఒక మండలంలో మాత్రం ఆసక్తి కర ఫలితాలు వచ్చాయి.
2019 ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దుగ్గిరాల మండలం వస్తుంది. ఆ నియోజకవర్గ పరిధిలో తాడేపల్లి..మంగళగిరి..తాడేపల్లి మండలాలు ఉన్నాయి. దుగ్గిరాల మినహా మిగిలిన రెండు మండలాలు మున్సిపాల్టీలో విలీనం చేసారు. దీంతో..దుగ్గిరాలలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ మండలం నారా లోకేశ్ నియోజకవర్గ పరిధిలోకి రావటంతో పాటుగా.. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సొంత మండలం. దీంతో.. ఈ మండలం ఫలితాల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అందులో టీడీపీ 9, వైసీపీ 8, జనసేన 1 గెలిచాయి. టీడీపీ ఎంపీపీ దక్కించుకొనే అవకాశం ఉంది. అయితే, జనసేన మద్దతు ఇక్కడ కీలకం కానుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ ఓడిపోయారు. వరుసగా రెండో సారి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి గెలుపొందారు. కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మద్దతు దారులే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు.
వైసీపీ నేతలు పదే పదే లోకేశ్ ఓటమి గురించి ప్రస్తావించటం.. ప్రభుత్వం వర్సెస్ అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అన్నట్లుగా వ్యవహారం సాగటంతో ఈ మండలంలో ఫలితాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియెజకవర్గం కుప్పంలోని నాలుగు మండలాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని జెడ్పీటీసీలను వైసీపీ గెలుపొందింది. సీనియర్ నేతల నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, తిరిగి వచ్చే ఎన్నికల్లో తాను తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేశ్ గతంలోనే స్పష్టం చేసారు.
Recommended Video
ఇక, మూడు రాజధానుల వివాదం కొనసాగుతున్న సమయంలో అమరావతి పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో ఫలితాల పైన భిన్న చర్చలు సాగుతున్నాయి. అమరావతికి దుగ్గిరాల దూరంగానే ఉంటుంది. అయినా... అమరావతి జోన్ పరిధిలోకి రావటంతో ఇక్కడ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక, ఇదే సమయంలో విశాఖ జిల్లాలోనూ వైసీపీ జెడ్పీ ఛైర్మన్ కైవసం చేసుకోగా... న్యాయ రాజధానిగా ప్రకటించి కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, దుగ్గిరాలలో సైతం ఒక ఎంపీటీసీ మాత్రమే టీడీపీ ఆధిక్యంలో ఉండటంతో ఇప్పుడు వైసీపీ అక్కడ ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.