అన్నా క్యాంటీన్లో ఆసక్తికర దృశ్యం:ఇక్కడే ఉంటే తంతానని పిల్లోడికి వార్నింగ్ ఇచ్చిన మంత్రి సునీత
అనంతపురం:మంత్రి పరిటాల సునీత అనంతపురంలో అన్నా క్యాంటీన్ పరిశీలన సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న అన్నా క్యాంటీన్ ను మంత్రి సునీత శనివారం సందర్శించారు.
అన్నా క్యాంటీన్ పరిశీలన నిమిత్తం విచ్చేసిన స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సునీత ఈ క్రమంలో క్యాంటిన్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, పంపిణీ తదిదర విషయాలన్నీ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కి ఆ క్యాంటిన్ లో ఒక బాల కార్మికుడు పనిచేస్తూ కనిపించారు. దీంతో మంత్రి ఆ పిల్లవాడికి సుతిమెత్తగా హెచ్చరిక చేయడం ఆసక్తికరంగా మారింది.
అన్నా క్యాంటిన్...తనిఖి
అనంతపురం బైపాస్ రోడ్ లోని అన్నా క్యాంటిన్ ను స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత శనివారం తనిఖీ చేశారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. భోజనం తయారీ, శుభ్రత ను పరిశీలించడంతో పాటు నాణ్యతపై అక్కడికి వచ్చిన వారిని వివరాలు అడిగి, తెలుసుకున్నారు.
ఆసక్తికర దృశ్యం...పిల్లాడికి వార్నింగ్
అయితే మంత్రి సునీత అన్నా క్యాంటిన్ ను పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఓ పిల్లవాడు ప్లేట్లు ఇస్తూ కనిపించాడు. మంత్రి వెంటనే అతడిని హెచ్చరిస్తూ..."ఏరా... బడికి పోలేదా...ఇక్కడ ఉంటే తంతా రేయ్..."అంటూ హెచ్చరించారు. మంత్రి బాల కార్మికుడి ని హెచ్చరించే దృశ్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు.
మంత్రి కూడా...ఇక్కడే భోజనం
ఆ తరువాత మంత్రి సునీత కూడా ఐదు రూపాయలిచ్చి టోకెన్ తీసుకుని, పేదలతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఆ తరువాత కొద్దిసేపు తానే స్వయంగా అన్నం వడ్డించారు. భోజనం కోసం శనివారం పెద్దఎత్తున ప్రజలు అన్నా క్యాంటీన్కు తరలివచ్చారు. వారిని అందరినీ క్యూలో నిలుచోమని ఆమే అందరికీ అన్నం పెట్టించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లకు ఊహించని విధంగా ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే ఆశయంతో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారన్నారు. అదే స్ఫూర్తితో పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబుకు...అండగా నిలవండి
క్యాంటీన్కు వచ్చిన వారితో నిర్వాహకులు గౌరవంగా మాట్లాడి భోజనం పెట్టాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేవపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మనందరం అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.