తెలుగు రాష్ట్రాల విద్యుత్ వెబ్ సైట్లు హ్యాక్ చేసిన అంతర్జాతీయ హ్యాకర్లు .. రూ.35కోట్లు డిమాండ్
తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల కన్ను పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేసిన వైనం ఇప్పుడు అధికార వర్గాలకు కొత్త తలనొప్పిగా మారింది.
మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు
ఏపీ, తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన అంతర్జాతీయ హ్యాకర్లు
ఏపీ, తెలంగాణకు చెందిన పలు విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేశారు.అంతర్జాతీయ హ్యాకర్ల బారిన పడిన డిస్కంల జాబితాలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.. హన్మకొండ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ.. తిరుపతి కేంద్రంగా పని చేస్తున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ.. విశాఖ కేంద్రంగా పని చేస్తున్న తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన అధికారిక వెబ్ సైట్లను హ్యాకర్లు హ్యాక్ చేశారు.
డేటా చోరీ చేసి తిరిగి ఇచ్చేందుకు 35 కోట్ల డిమాండ్ .. బ్యాకప్ ఉండటంతో తప్పిన ముప్పు
అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ర్యాన్ సమ్ వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను దొంగలించి.. డేటాను పూర్తిగా తొలగించారు. ఈ డేటాను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లు డబ్బు డిమాండ్ చేశారు. సమాచారం అంతా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది.హ్యాక్ అయిన వెబ్ సైట్లు మొత్తం.. ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ నిర్వహిస్తుంది . తెలుగు రాష్ట్రాల్లోని డిస్కంలను హ్యాకర్లు టార్గెట్ చేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన .. ఐటీ యాక్ట్ క్రింద కేసు నమోదు ..
రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిస్కంల హ్యాకింగ్పై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్టు కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.