నేను జగన్ అభిమానిని, పోస్టులు పెడుతూనే ఉంటా: రవి కిరణ్
తాను జగన్ అభిమానిని అని ఇంటూరి రవికిరణ్ చెప్పారు. పొలిటికల్ పంచ్లో పోస్టులు కొనసాగుతాయని ఆయన స్పష్ట చేశారు.
విజయవాడ: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిని అని, పొలిటికల్ పంచ్లో పోస్టులు కొనసాగుతాయని పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ చెప్పారు. సాక్షిలో తాను ఫ్రీలాన్సర్గా పని చేస్తున్నట్లు ఆయన మరోసారి చెప్పారు.
పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ ఇవాళ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యాడు. సుమారు మూడున్నర గంటలపాటు విచారణ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
విచారణలో అడిగిన విషయాలను ఆయన వెల్లడించారు. శాసనమండలిపై చేసిన పోస్ట్కు పోలీసులు వివరణ అడిగారని తెలిపారు. అయితే శాసనమండలిపై పోస్ట్ చేయడం తప్పు అని తనకు తెలియదని వివరణ ఇచ్చినట్లు చెప్పారు.
అయితే రెండునెలల కింద పెట్టిన పోస్టుకు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారో అర్థంకావడంలేదని అన్నారు. ఇది కక్షసాధింపు చర్యగా తాను భావిస్తున్నట్లు రవికిరణ్ వ్యాఖ్యానించారు.ఈనెల 30న మరోసారి విచారణకు రమ్మన్నారు.. హాజరవుతామని రవికిరణ్ స్పష్టం చేశాడు.
సోషల్ మీడియాలో శాసనమండలిని ఉద్దేశించి అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటూరి రవికిరణ్ను, వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జి చల్లా మధుసూదన్రెడ్డిని పోలీసులు మంగళవారం విచారించారు. ముందుగా మధుసూదనరెడ్డి ఉదయం 11.30కి తుళ్లూరు పోలీసు స్టేషన్కు వచ్చారు.
గంటన్నర సేపు పోలీసులు ఆయనను విచారించారు. గుంటూరు జిల్లా నేర పరిశోధనా విభాగం అదనపు ఎస్పీ వైటీ నాయుడు, అమరావతి సహాయ ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీఐ సుధాకర్ ఈ విచారణ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన మధుసూదన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వైసీపీతో రవికిరణ్కు సంబంధం ఉందా అని పోలీసులు అడిగారని చెప్పారు. టీడీపీ సోషల్ మీడియాలో పలుమార్లు జగన్పై అభ్యంతరకర పోస్టింగ్లు వచ్చాయని, వాటిపై ఫిర్యాదు తీసుకోవాలని కోరగా పోలీసులు నిరాకరించినట్లు తెలిపారు. ఈ నెల 30న మళ్లీ హాజరు కావాలని పోలీసులు సూచించినట్లు తెలిపారు.
వారు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రవికిరణ్కు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. విచారణకు వెళ్లే ముందు కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. రవికిరణ్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సంబంధం లేదని, ఆయన పార్టీకి అభిమాని మాత్రమేనని తెలిపారు. ఆయనకు జీతం చెల్లించి ఉద్యోగంలో పెట్టుకోలేదని చెప్పారు.
అనంతరం మధ్యాహ్నం రవికిరణ్ స్టేషన్కు వచ్చారు. రాత్రి పొద్దుపోయేదాకా ఆయనను పోలీసులు విచారించారు. ఉద్దేశపూర్వకంగా తాను ఈ పనిచేయలేదని, వివిధ పార్టీలపై దాదాపు 2400 పోస్టింగ్లను సోషల్ మీడియాలో పెట్టామని అంతకుముందు ఆయన మీడియాతో అన్నారు.
కేసీఆర్, జగన్ మీద కూడా పోస్టింగ్లు వచ్చాయన్నారు. శాసనమండలిని ఉటంకిస్తూ పెట్టిన పోస్టింగ్ అభ్యంతరకరంగా ఉందని తానే ఆ తరువాత తొలగించినట్లు తెలిపారు.