ఎపి:ఆ సంస్థ అక్రమాలపై విచారణ జరపండి...ఎసిబికి హై కోర్టు ఆదేశం
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్ పరికరాల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టని ఎసిబి తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుబట్టింది.
ఆ నిర్వహణ కాంట్రాక్టు పొందిన టీబీఎస్ టెలిమాటిక్ అండ్ బయోమెడికల్ సర్వీసెస్ లిమిటెడ్ అక్రమాలపై ఫిర్యాదు అందినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు చేయడం అటుంచి కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేపట్టని ఎసిబిని హై కోర్టు నిలదీసింది. గత ఏడాది డిసెంబరులో ఫిర్యాదు ఇస్తే ఇప్పటివరకు స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించింది. టీబీఎస్ అక్రమాలపై నాలుగు వారాల్లో దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఎసిబిని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
టీబీఎస్ అక్రమాలపై...పిల్ దాఖలు
జాతీయ హెల్త్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయో మెడికల్ పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన టెలిమాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ లిమిటెడ్(టీబీఎస్) అక్రమాలకు పాల్పడిందని, రూ.50.93 కోట్ల దుర్వినియోగం జరిగిందంటూ ఎసిబికి ఫిర్యాదు చేసినా స్పందించలేదంటూ తూర్పుగోదావరి జిల్లా అవిడి గ్రామానికి చెందిన ఇందుకూరి వెంకటరామరాజు హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.గంగయ్య నాయుడు వాదనలు వినిపిస్తూ పీహెచ్సీ, సీహెచ్సీల్లో బయోమెట్రిక్ నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన టీబీఎస్ అక్రమాలకు పాల్పడిందని, దీనిపై ఆధారాలతో సహా గత ఏడాది డిసెంబరు 18న ఎసిబి డీజీపికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అక్రమాలు...ఇలా
మెషినరీ నిర్వహణ సర్వీసు ఛార్జీ వస్తువు కొనుగోలు ధరపై 7.4 శాతం ఉంటుందని అందువల్ల వాటి ధరను అధికారుల సాయంతో కాంట్రాక్టర్లు ఎక్కువగా చూపారని న్యాయవాది పేర్కొన్నారు. రూ.840 విలువ చేసే గ్లూకోమీటరును కంపెనీ ధర రూ.5.08 లక్షలుగా చూపి నిర్వహణ ఛార్జీలు పొందిందని వెల్లడించారు. 12 గ్లూకోమీటర్లకు గాను ఏకంగా రూ.60.96 లక్షలను సంస్థ క్లెయిం చేసిందని ఆయన తెలిపారు. అంతేగాకుండా గ్లూకోమీటరు మరమ్మతుకు రూ.37,642 ఛార్జీ చేస్తోందని, ఒక్క గ్లూకోమీటరుకు పెట్టే మరమ్మతు ఖర్చుతో 44 కొత్త గ్లూకోమీటర్లు కొనుగోలు చేయవచ్చన్నారు. కర్నూలు జీజీహెచ్లో రూ.1.70 కోట్ల విలువ చేసే ఎంఆర్ఐ మిషన్ నిర్వహణకు రూ.3.5 కోట్లు ఛార్జీ చేసిందని చెప్పారు. రూ.5 వేల విలువ చేసే మైక్రోటెక్ స్కానర్ను రూ.2.48 కోట్లుగా చూపి నిర్వహణ ఛార్జీలు వసూలు చేసిందని టిబిఎస్ అక్రమాలను ధర్మాసనం ముందు ఏకరువు పెట్టారు.
సూపరింటెండెంట్...సంతకంలేకపోయినా...
కంపెనీ చేసిన బిల్లులు చెల్లించాలంటే ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం అవసరముండగా, దానితో సంబంధం లేకుండా సొంతంగా బిల్లులు తయారు చేసి సొమ్ము వసూలు చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అవినీతి జరిగిందని, దీనిపై ఫిర్యాదు చేసినా ఎసిబి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీనిపై ఏసీబీ వివరణ కోరగా ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, అయితే ఫిర్యాదు పరిశీలనలో ఉందని, ఇంకా దర్యాప్తు ప్రారంభించలేదని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఫిర్యాదు అందితే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా చేయరా?... అని నిలదీసింది.
ప్రభుత్వం విచారణ...తిరస్కరణ
దీనిపై వైద్యఆరోగ్య శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది బి.దేవానంద్ జోక్యం చేసుకుంటూ అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించిందని, అందుకు సంబంధించిన వివరాలను ధర్మాసనం ముందుంచారు. అయితే వీటిని పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ విచారణను ఎసిబి విచారణగా ఎలా చెబుతారని తిరిగి ప్రశ్నించింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసి 4 వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఎసిబిని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.