అమెరికా నుంచి సిఎం రాగానే...టీడీపీ ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే హత్యలపై దర్యాప్తు:మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి వచ్చిన వెంటనే దర్యాప్తు చేపట్టి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
సోమవారం విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను నక్సల్స్ హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనలో గన్మెన్లు, పోలీసుల వైఫల్యంపై విచారణ జరుగుతుందని మంత్రి కొల్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు. పేదల కోసం పని చేస్తున్న ప్రజాప్రతినిధులను హత్యచేయటం హేయమైన చర్య అని మంత్రి స్పష్టం చేశారు.
వైసిపి అధ్యక్షుడు జగన్ మూడు వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసి పెద్ద ఘనకార్యంలాగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.అవినీతి నాయకుడైన జగన్ ఎన్ని యాత్రలు చేసినా...3వేల కిలోమీటర్లు కాదు.. 30 వేల కిలోమీటర్లు నడిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొల్లు తేల్చేశారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు జగన్ చేస్తున్న అన్యాయం, దోచుకున్న విధానం తాలూకు పాపాలు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా సమసిపోవన్నారు.
కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి...అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడిన వ్యక్తి యాత్రలు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటని మంత్రి కొల్లు ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు చేసిన పాదయాత్ర విలువలతో కూడినదని, జగన్ యాత్ర టైంపాస్ యాత్ర అని మంత్రి కొల్లు వ్యాఖ్యానించారు. అందుకే జగన్ పర్యటనకు ప్రజలు ఎవరూ రావటం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొల్లు పేర్కొన్నారు.
అయినా జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయి రోడ్లుపై తిరుగుతున్నారని మంత్రి కొల్లు విమర్శించారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీని జగన్ ఒక్క మాట కూడా అనటం లేదని, అసలు రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడటమే లేదని అన్నారు. జగన్ తన కేసుల మాఫీ కోసం బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్నారని మంత్రి కొల్లు ఆరోపించారు.