మొన్న రవికిరణ్.. నిన్న రవీంద్ర.. అనిత ఫిర్యాదుతో అరెస్టు, అండగా వైసీపీ (అరెస్టు ఫోటోలు)
పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు రవీంద్రను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విశాఖలో పలుచోట్ల జీపులో తిప్పి, మధ్యాహ్నం 2.30గం. సమయంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ ముందు హాజరుపరిచారు.
విశాఖపట్నం: మొన్న పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్.. నిన్న ఐటీ ఉద్యోగి ఇప్పాల రవీంద్ర.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యక్తులను కించపరిచేలా కామెంట్లు చేశారన్న ఆరోపణలతో పోలీసులు వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఐటీ ఉద్యోగి ఇప్పాల రవీంద్రను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
రవీంద్ర అరెస్టు కోసం మంగళవారం రాత్రే బెంగుళూరులోని రామకృష్ణనగర్లో ఉన్న రవీంద్ర ఇంటికి పోలీసులు చేరుకున్నారు. తొలుత ఈ నెల 22న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కాసేపటికి ఏసీపీ రమ్మంటున్నారని ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు.
రాత్రి హైదరాబాద్లోనే ఉంచి.. బుధవారం ఉదయం 5.30గం. సమయంలో రవీంద్రను పోలీసులు నేరుగా విశాఖపట్నంకు తరలించారు. పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు రవీంద్రను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విశాఖలో పలుచోట్ల జీపులో తిప్పి, మధ్యాహ్నం 2.30గం. సమయంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ ముందు హాజరుపరిచారు.
అనంతరం కోర్టు ఎదుట హాజరుపరిచి.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ.. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, అభ్యంతరకర పోస్టులు పెట్టలేదని తెలిపారు. మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం ఇప్పాల రవీంద్ర మహిళా ఎమ్మెల్యేపై తీవ్ర అభ్యంతరకర పోస్టులు చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ ను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, రవికిరణ్ విషయంలో వ్యవహరించినట్లుగానే రవీంద్ర విషయంలోను వైసీపీ వ్యవహరిస్తోంది. రవీంద్రకు అండగా ఉంటామని, ఖర్చులు భరిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.