స్మగ్లర్స్ కు దడ పుట్టిస్తోన్న ఐపీఎస్ జయలక్ష్మి : వదిలేది ప్రసక్తే లేదంటూ వార్నింగ్
తిరుపతి : అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ ఆర్.జయలక్ష్మి ఎర్రచందనం స్మగ్లర్లకు దడ పుట్టిస్తున్నారు. స్మగ్లర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన జయలక్ష్మి, ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపి స్మగ్లింగ్ కి పాల్పడుతున్న ముఠాల ఆటకట్టిస్తున్నారు.
జయలక్ష్మి ఆదేశాల మేరకు తాజాగా చెన్నై, పూన్దమలై సిడ్కో అనే పారశ్రామిక ప్రాంతంలోని ఓ గోడౌన్ లో భారీ కంటైనర్ ను స్మగ్లింగ్ నియంత్రణ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఈ కంటైనర్ లో దాదాపుగా 237 ఎర్ర చందనం దుంగలు బయటపడినట్టుగా తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ దుంగల బరువు సుమారుగా ఏడు టన్నుల వరకు ఉండవచ్చని అంచనా.
దుంగలతో పాటు 2 ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్, 2 వుడ్ కట్టర్ మిషన్లను పెద్ద మొత్తంలోస్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించిన ఐపీఎస్ జయలక్ష్మి.. స్మగ్లింగ్ కు పాల్పడేవారు ఎంతటి హోదాకు చెందినవారైన వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.
స్మగ్లింగ్ ను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పుకొచ్చిన అధికారిణి జయలక్ష్మి.. ముఖ్యంగా తిరుపతి పరిధిలో ఉన్న స్మగ్లర్స్, పైలట్స్, వారికి సహాయ సహకారాలు అందిస్తోన్న ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అరెస్టు చేసే ప్రతీ ఒక్కరిపై అటవీ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని ప్రకటించిన ఆమె, అటవీ చట్టాల ప్రకారం స్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశముందన్న విషయాన్ని వెల్లడించారు.