జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు..!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యురో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేసింది. అఖిల భారత ఉద్యోగుల సర్వీసుల నియమావళి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఆయనను విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
పోస్టింగ్ ఇవ్వకుండా..
1989 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు. పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ హోదాలో కొనసాగుతున్నారు. ఇదివరకు పలు కీలక హోదాల్లో పని చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా చాలాకాలం పాటు విధులను నిర్వర్తించారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. అనంతరం ఆయనను బదిలీ చేసింది. పోస్టింగ్ ఇవ్వలేదు జగన్ సర్కార్.
చంద్రబాబుకు అనుకూలంగా..
ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్గా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా తెలుగుదేశం పార్టీ గెలుపోటములపై ఆరా తీసేవారంటూ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, ఇతర నాయకులు కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
బదిలీ వేటు వేసిన ఎన్నికల కమిషన్..
ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఏబీ వెంకటేశ్వర రావుపై బదిలీ వేటు వేశారు. ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్ పదవి నుంచి తప్పించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఏబీవీతో పాటు అప్పట్లో కడప, శ్రీకాకుళం జిల్లా ఎస్పీలపైనా బదిలీ వేటు వేశారు. అనంతరం కడప, శ్రీకాకుళం జిల్లా ఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఏబీ వెంకటేశ్వరరావును మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగించింది.
కుమారుడి సంస్థకు సెక్యూరిటీ పరికరాల తయారీ కాంట్రాక్టు..
ఏబీ వెంకటేశ్వర రావు పోస్టింగ్లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు అప్పట్లో వెలువడ్డాయి. ఆయన తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలను తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారంటూ విమర్శలు చెలరేగాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది జగన్ సర్కార్. ఆరోపణలు నిజమేనని తేలడంతో.. ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసిందని అంటున్నారు.