పనిచేయకుండా గడ్డి పీకుతున్నారా?: కాంట్రాక్టర్లకు దేవినేని 'క్లాస్'
పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ కాంట్రాక్టర్లను మందలించారు.
విజయవాడ: ప్రభుత్వ ప్రాజెక్టుల పట్ల అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై కన్నెర్ర చేస్తున్నారు ఏపీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పనుల్లో జాప్యాన్ని ఎండగడుతూ కాంట్రాక్టర్లకు దేవినేని 'క్లాస్' ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే బ్లాక్ లిస్టులో పెట్టేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి దేవినేని కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ కాంట్రాక్టర్లను మందలించారు. ఒక పని చేస్తున్నామంటే.. దానిపై శ్రద్ద, పట్టుదల, పౌరుషం ఉండాలన్నారు.
ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయాలన్న కసితో పనిచేయాలని కాంట్రాక్టర్లకు హితవు పలికారు. మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు దేవినేని. పనితీరు మార్చుకోకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడం ఖాయమని చెప్పారు.
పనులు త్వరగా పూర్తి చేయాలని.. అలా అని నాణ్యతను గాలికొదిలేస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను దేవినేని హెచ్చరించారు. ఎక్కడా నాణ్యతా లోపాలనేవి లేకుండా.. పూర్తి క్వాలిటీతో ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.