ఆధార్ కార్డుల్లో...ఎన్ని మాయలో:సిఎస్సీ సెంటర్లు,మీ సేవా కేంద్రాల్లో....ఇదో దందా!
అమరావతి: కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)లు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఆధార్ కార్డులతో అనేక మాయలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందాలని అనుకునేవారికోసం ఈ గుర్తింపు కార్డులో ఇష్టారాజ్యం గా మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
ఇందుకోసం లబ్దిదారుల నుంచి వేలకువేలు వసూలు చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్ని గ్రామాల్లో ఉండాల్సిన మీ సేవా కేంద్రాలను ఏకంగా పట్టణాలకు తరలించి అక్కడే సీఎస్సీ కేంద్రాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డుల్లో చిరునామా లే కాదు ఏకంగా వయస్సు కూడా లబ్దిదారుడు కోరుకున్న విధంగా మార్చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2012లో...ప్రైవేటు ఏజెన్సీలకు!
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మీసేవా కేంద్రాల నిర్వహణా బాధ్యతలను 2012లో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీవారు అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల మీ సేవా కేంద్రం నిర్వాహకులు ఆధార్కార్డులను మార్చేసినట్లు ఫిర్యాదులు అందడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆయా కేంద్రాలను రద్దు చేయడం కూడా జరిగింది. అయితే వారు అప్పటికే కొన్ని లక్షల ఆధార్కార్డుల్లోని సమాచారాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాల్లో గ్రామాల్లో ఉన్న మీసేవా కేంద్రాలను పట్టణంలో ఏర్పాటు చేసుకుని దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అండదండలతో...అక్రమాలు
అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో తమ బలం నిరూపించుకునేందుకు, తమకు ప్రజాదరణ పెంచుకునేందుకు గ్రామస్థులకు పింఛన్లు, పెళ్లికానుకలు ఇప్పిస్తామని చెప్పి వారి ఆధార్కార్డుల్లో తక్కువ వయసు ఉన్నా వయసు పెంచి, అనర్హులకు లబ్ధి కల్పించడం...ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేయడం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే వాస్తవానికి బాల్య వివాహాలు చేసుకునే వారు పెళ్లికానుక పథకానికి అనర్హులే కాదు అందుకు ఒడిగట్టినవారు శిక్షార్హులు కూడా. దీంతో ఎలాంటి ఇబ్బందిలేకుండా లబ్ది పొందేందుకు బాలికకు చెందిన ఆధార్కార్డులో వయస్సు మార్పించేస్తున్నారని తెలిసింది.
రద్దయినా...ఆగని అక్రమాలు..
గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తుల యూఐడీఐని కొన్ని ఆధార్ సీడింగ్ కేంద్రాల నిర్వాహకులు బహిర్గతం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆధార్ ఎన్ రోలింగ్ కేంద్రాలను తీసేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్రోలింగ్ బాధ్యతలను కేవలం మండల కేంద్రాల్లోని మీసేవ కేంద్రాలకు, బ్యాంకులకు, పోస్టాఫీసులకు మాత్రమే ఇచ్చారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఉండటం వలన అక్రమాలు జరగవని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన సిబ్బంది లేకపోవడం వలన ఆధార్ ఎన్రోలింగ్ బాధ్యలను గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించేస్తున్నారు.
అక్రమాలు...ఇలా కూడా
కొన్ని బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది వారికి కేటాయించిన ఐడీలను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు రేటు కట్టి విక్రయించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఐడీ ప్రకారం సదరు ఉద్యోగికి చెందిన వేలిముద్రలు తీసుకుని బయట సీఎస్సీ కేంద్రాల్లో ఆధార్ కార్డుల్లో వయస్సు, ఇతర సమాచారాన్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కేంద్రాలు పలు జిల్లాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
అనర్థం...ఇవే ఉదాహరణలు
ప్రకాశం జిల్లాలో ఒక మండలానికి చెందిన ఓ వ్యక్తికి 55 ఏళ్లు ఉండగా పింఛను ఇప్పిస్తామని ఓ నాయకుడు ఆధార్కార్డు తీసుకెళ్లి వయస్సు 65 గా మార్పించారు. ఏడాది పాటు పింఛను రాలేదు. ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు. వయస్సు ఎక్కువ వేయడం వలన చంద్రన్న బీమాకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. అదేవిధంగా మరో మండలంలోని 9వ తరగతి విద్యార్థినికి వివాహం చేసిన కుటుంబ సభ్యులు పెళ్లి కానుక కోసం ఆధార్కార్డులో వయస్సు పెంచారు. బాల్య వివాహం చేసుకున్నారంటూ ఫిర్యాదు అందడంతో సదరు అధికారులతో గొడవలు పడి కేసులు పెట్టకునే వరకు వెళ్లాయి పరిస్థితులు.
కొత్త కేంద్రాలు లేవు...అక్రమాలు ఆగవు...
అయితే రాష్ట్రంలో పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు సరిపడినన్ని మీ సేవ కేంద్రాలు లేకపోవడం వలన ప్రైవేటు వ్యక్తులు వివిధ ఏజెన్సీల పేర్లతో రహస్యంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్ని పట్టణాల్లో కనీసం 10 మీసేవ కేంద్రాలు ఉండాల్సివుంటే కేవలం ఒక్కటే నడుస్తున్న పరిస్థితి. దీంతో పలుచోట్ల పలువురు ప్రజా ప్రతినిధులు కోర్టుకు వెళ్లినా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు చొరవ చూపడం లేదు. ఫలితంగా అక్రమార్కులు బినామీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆధార్ ఎన్రోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, జనాభా సంఖ్యకు అనుగుణంగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.