పప్పు మహరాజ్! ట్వీట్లు కాదు..ప్రెస్ మీట్లు పెట్టు: నారా లోకేష్ కు మంత్రి అనిల్ సవాల్
అమరావతి: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వరదల నేపథ్యంలో.. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన నీటి పారుదల శాఖ మంత్రి కాదని, నోటి పారుదల శాఖ మంత్రి అని అనిల్ కుమార్ యాదవ్ ను విమర్శించారు నారా లోకేష్. దీనిపై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీర ప్రాంత గ్రామాలు వరదనీటితో ముంపునకు గురైతే.. ఒక్కసారిగా కూడా నారా లోకేష్ పరామర్శలకు ఎందుకు రాలేదని విమర్శించారు. ట్వీట్లు చేస్తూ..ఇంటికే పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. ఆ ట్వీట్లు కూడా వేరెవరో పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేష్ చేసిన ట్వీట్లను ఆయన దృష్టికి తీసుకుని రాగా..వాటిని తేలిగ్గా తీసుకున్నారు. వరద ప్రభావానికి గురై తీర ప్రాంత గ్రామీణ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. నారా లోకేష్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో తిరగాలని అన్నారు. ట్వీట్లు పెట్టడం కాదని.. ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు. అమెరికాలో చదువుకున్నప్పటికీ.. ఆయనకు ట్వీట్లు కూడా చేయడం రాదని అన్నారు. తనకు తెలుగు సరిగ్గా రాదని వరద ప్రభావానికి గురై తీర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వారిని పరామర్శించడానికి లోకేష్ ఎందుకు రాలేదని నిలదీశారు.
నారా లోకేష్ కు మంత్రి అనిల్ సవాల్ pic.twitter.com/J6ivXtZgTv
— Oneindia Telugu (@oneindiatelugu) August 22, 2019
ట్వీట్లు సరిగ్గా చేయలేక.. మాటలు సరిగ్గా మాట్లాడలేకపోతున్న నారా లోకేష్ ఇక ఎందుకు పనికి వస్తారని ప్రశ్నించారు. వరదలు సంభవించి ఏడెనిమిది రోజులువుతోందని, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారని అన్నారు. అలా ప్రజల్లో తిరగాలంటే నారా లోకేష్ కు భయం అని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అందుకే ఆయనను ప్రజలు పప్పు మహరాజ్ అని బిరుదు ఇచ్చారని చెప్పారు. ట్వీట్ల ప్రపంచం నుంచి నారా లోకేష్ బయటికి రావాలని అన్నారు. ప్రజలకు ముఖం చూపించలేక ట్వట్లకే పరిమితం అయ్యారని విమర్శించారు.