సమీక్షల పేరుతో సొంత పార్టీ నేతలనే విసిగిస్తున్నారా చంద్రబాబు .. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
ఏపీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులతో , ముఖ్య నాయకులతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇచ్చిన వైసీపీని తట్టుకోవటం కోసం ఒళ్ళు హూణం చేసుకున్నారు పోటీ చేసిన అభ్యర్థులు. ఇక ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాల కోసం ఈనెల 23 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈలోపు కాస్త రెస్ట్ తీసుకుందామంటే, ఏ విహార యాత్రకో వెళ్దామంటే వారికి ఊపిరాడనివ్వకుండా సమీక్షా సమావేశాలు పెడుతున్నారు చంద్రబాబు .
మోదీ ప్రధానిగా ఉండరు..ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసాం: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
చంద్రబాబు సమీక్షా సమావేశాలపై టీడీపీ నేతల నిరాసక్తి ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళిపై , ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం అన్న అంశాలపై చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు టీడీపీ నేతలకు రుచించటం లేదు. ఒకపక్క ఏపీలో వైసీపీదే విజయం అని చాలా సర్వేలు చెప్తుంటే అసలే టెన్షన్ లో ఉన్న టీడీపీ నేతలను చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహించి మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. దీంతో చాలా మంది నాయకులు సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారు. అసలే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్ ఒక పక్క, సీఎస్, ఈసీ లతో ఘర్షణ ఒక పక్క , ప్రతిపక్ష పార్టీలు చేసే మాటల దాడి మరోపక్క ... ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న చంద్రబాబు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్ర పోనివ్వను అన్న చందంగా వ్యవహరిస్తుంటే బయటకు చెప్పలేక టీడీపీ నేతలు లోలోపల మధనపడుతున్నారు. అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకు అని వారిలో వాళ్ళే గుసగుసలాడుతున్నారట.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకుల గైర్హాజరు
నిన్నటికి నిన్న శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యే హాజరు కాకపోవటంతో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకపక్క అధికారులు, మరో పక్క సొంతపార్టీ నేతలు సైతం సమీక్షలకు డుమ్మా కొడుతున్న తీరు చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. అయినా చంద్రబాబు సొంత పార్టీ నేతల ఫీలింగ్స్ కూడా అర్ధం చేసుకోలేకపోతున్నారు.
శ్రీకాకుళంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు హాజరు కావాల్సి ఉండగా ఈ సమీక్షకు శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండాలక్ష్మీదేవి హాజరుకాకపోవడంతో శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ముఖనేతలు కూడా హాజరు కాలేదు. .దీంతో ఏం చెయ్యాలో పాలుపోని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు .ఇది పద్థతికాదంటూ అక్కడ ఉన్న నేతలకు క్లాస్ పీకారు. టీడీపీ నేతలు క్రమశిక్షణతో మెలగాలని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటూ హితవు పలికారు.
ఫలితాలు ప్రజా తీర్పు ఎలా ఉంటె అలానే వస్తాయని భావిస్తున్న టీడీపీ నేతలు
గెలుపో..ఓటమో. పోలింగ్ అయితే అయిపోయింది. ఫలితాలు జనాలు ఎలా తీర్పిస్తే అలాగే వస్తాయి. అలాంటప్పుడు ఈ సమీక్షలు ఎందుకు? అనేది లాజిక్కే. అయితే చంద్రబాబు మాత్రం అది అర్ధం చేసుకోకుండా సమీక్షల పేరుతో పార్టీ నేతలను వాయిస్తూ ఉన్నారు. ఇక వారు సాధ్యమైనంత వరకు డుమ్మా కొడుతున్నారు.