ఏపీ నుంచి రాజ్యసభకు వెంకయ్య నో చెప్పారా, అందుకేనా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన కేంద్రం చేతులెత్తేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా పైన నాటి యూపీఏ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఏపీకి నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించింది.
దానిపై వెంకయ్య నాయుడు అంతెత్తున లేచారు. ఏపీకి అయిదేళ్లు కాదని, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆ ప్రకటన చేసేందుకు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. బిజెపి ఒత్తిడి కారణంగానే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తర్వాత కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. పదేళ్ల ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి అయ్యారు. ఈ రెండేళ్ల పాటు బిజెపి ప్రత్యేక హోదాపై నాన్చుతూ వస్తోంది. ఏపీకి కేంద్రం కచ్చితంగా హోదాను ఇస్తుందని ఏపీ బిజెపి నేతలు నమ్మబలికారు.
తీరా ప్రత్యేక హోదా పైన కేంద్రం నీళ్లు చల్లింది. చట్టంలో లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాను చట్టంలో పేర్కొనక పోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు అని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ హామీ ఇచ్చిన బిజెపి.. రాష్ట్రాలన్నింటిని ఒప్పించి ఇవ్వాలి కదా అని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నో చిక్కులు ఉన్నాయి. కానీ హామీని నెరవేర్చాల్సిందేనని ఏపీ ప్రజలు నిలదీస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు - రాజ్యసభ అంశం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలో పలువురి రాజ్యసభ టర్మ్ పూర్తవుతుంది. ఏపీ నుంచి నలుగురి టర్మ్ పూర్తి కానుంది. మరోవైపు, వెంకయ్య నాయుడి టర్మ్ కూడా పూర్తి కానుంది.
ఈ నేపథ్యంలో వెంకయ్యను ఈసారి ఏపీ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపించాయి. టిడిపి - బిజెపి మిత్రపక్షంగా ఉంది. చంద్రబాబు.. ఒక స్థానాన్ని బిజెపికి ఇస్తారని, అది వెంకయ్యకు లేదా నిర్మలా సీతారామన్కు కావొచ్చని వాదనలు వినిపించాయి.
ప్రధానంగా వెంకయ్య నాయుడి పేరు వినిపించింది. పైగా, ఏపీకి పదేళ్లు హోదా కావాలని వెంకయ్య నాడు పట్టుబట్టరు. ఆ అభిమానం ఏపీ ప్రజల్లో ఉంది. అయితే, ఆ తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు వెంకయ్య సుముఖత చూపలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తెలియడం వల్లే వెంకయ్య ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లవద్దని భావించారా? అనే చర్చ సాగుతోంది.