కోడెల బీజేపీలో చేరాలనుకున్నారా? అమిత్ షా అపాయింట్ మెంట్ ప్రయత్నించారా? బీజేపీ నేత మాటలకు అర్థమేంటీ?
గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు భారతీయ జనతాపార్టీలో చేరాలనుకున్నారా? ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేశారా?, ఫర్నిచర్ తరలింపు తరువాత తెలుగుదేశం పార్టీలో ఆయన తీవ్ర నిరాదరణకు గురయ్యారా?, అన్నీ సవ్యంగా సాగివుంటే దసరా తరువాత ఆయన కాషాయ కండువా కప్పుకొని ఉండేవారా?.. రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా మొదలైన చర్చ ఇది. భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ సమన్వయకుడు పురిఘళ్ల రఘురామ్ చేసిన వ్యాఖ్యల అనంతరం తలెత్తిన ప్రశ్నల పరంపర ఇది. కోడెల శివప్రసాద రావు బీజేపీలో చేరాలనుకున్నారని రఘురామ్ దేశ రాజధానిలో చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయి. న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ పార్టీ అధినేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తాను కలవాలని కోరుకుంటున్నానని, దీనికోసం తనకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోడెల తనను సంప్రదించినట్లు రఘురామ్ వెల్లడించారు. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు ఉదంతం అనంతరం తెలుగుదేశం పార్టీ తనను ఏకాకిని చేసిందని కోడెల తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. తనపై బురద జల్లడానికి జిల్లా నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తాను టీడీపీలో కొనసాగలేనని కోడెల తనకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కోడెల హఠాన్మరణం వెనుక గల అసలు కారణాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ఈ దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓడిపోయిన వారిని పక్కన పెట్టే సంస్కృతి పార్టీలో పేరుకుపోయిందని, దీనికి తాను కూడా అతీతుడిని కానని కోడెల తనకు ఫోన్ ద్వారా వెల్లడించినట్లు రఘురామ్ చెప్పారు. కోడెల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆయన జీవించి ఉండి ఉంటే దసరా తరువాత బీజేపీలో చేరి ఉండేవారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని తెలిపారు. నిజాయితీతో పనిచేసే నాయకులకు టీడీపీలో విలువలేదని, పార్టీలో తనను ఒంటరిని చేశారని కోడెల బాధపడేవారని అన్నారు. అమిత్ షాను కలువకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమన్నారు. కోడెల మృతిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు చేయించాలని, అప్పుడే అసలు కారణాలు వెలుగు చూస్తాయని అన్నారు.