బీజేపీ-జనసేన మధ్య బీసీ ముఖ్యమంత్రి చిచ్చు: జన సైనికుల ఆశలు ఆవిరేనా?
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో పొత్తు పార్టీలుగా గుర్తింపు పొందిన బీజేపీ-జనసేన మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే విషయం మరోసారి రుజువైనట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్, ఆయన సారథ్యం వహిస్తోన్న జనసేన పార్టీని బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు లైట్గానే తీసుకున్నారనేది స్పష్టమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి చాకచక్యంగా పవన్ కల్యాణ్ను తప్పించిన కమల నాథులు.. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం నుంచీ ఆయనను సైడ్ చేశారనేది తేలిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
నిమ్మగడ్డ వద్దంటోన్నా: పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు: అత్యధికం.. అత్యల్ప జిల్లాల లిస్ట్ ఇదే
బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్తో
2024లో రాష్ట్ర అసెంబ్లీకి నిర్వహించబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తోంది బీజేపీ. దీనికోసం ఇప్పటి నుంచే కొన్ని కీలకమైన, వ్యూహాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే- బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన తాజా ప్రకటన ఉద్దేశం అదే. దానితో పాటు ఎవరినో ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన నేతల్లో ఆందోళనలో పడేసేలా కనిపిస్తున్నాయి.
సోము సవాల్.. జనసేనలో కాక
వచ్చే ఎన్నికల్లో తాము బీసీని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆ దమ్ముందా అంటూ సోము వీర్రాజు విసిరిన సవాల్.. ఆ రెండు పార్టీల సంగతేమో గానీ.. మిత్రపక్షం జనసేనలో మాత్రం కలకలం రేపుతోంది. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ మొన్నటికి మొన్న తిరుపతిలో ప్రతిపాదించింది. దానికి భిన్నంగా సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ను తీసుకుని రావడం జనసేనకు మింగుడు పడట్లేదు.
కాపులు బీసీల్లోకి చేర్చుతారా?
సోము వీర్రాజు.. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. తాను చేసిన ప్రకటనకు సోము వీర్రాజు కట్టుబడి ఉంటే.. 2024 ఎన్నికల్లో వారిద్దరూ ముఖ్యమంత్రి రేసులో ఉండరు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, సొంతంగా పోటీ చేస్తే తప్ప.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉండలేరు. లేదా- కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. దీనికోసం కాపు సామాజిక వర్గ నేతలు చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. కాపులను బీసీలుగా గుర్తిస్తామంటూ 2014లోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. అది అమలు కాలేదు. 2024 నాటికి కాపులను బీసీల్లోకి చేర్చే ప్రతిపాదనలేమైనా కేంద్రం వద్ద ఉండొచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతోన్నాయి.
పవన్ కల్యాణ్కు పొగబెట్టినట్టేనా?
సోము వీర్రాజు తాజాగా చేసిన ప్రకటనలు మిత్రపక్షాన్ని ఆందోళనకు గురి చేసేవే అనడంలో సందేహాలు అనవసరం. బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్తో పాటు ఎవరినో తాము ముఖ్యమంత్రిని ఎందుకు చేస్తామంటూ సోము చేసిన వ్యాఖ్యలు సైతం బీజేపీ వైఖరిని తేటతెల్లం చేసినట్టయింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేయడానికే జనసేనకు అవకాశం ఇవ్వడానికి ససేమిరా అంటోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ను బీజేపీ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తుందనే అనుమానాలు నెలకొంటున్నాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. జనసేనకు పొగబెట్టినట్టేనని అంటున్నారు.
జన సైనికుల మాటేంటీ?
తాము ఆరాధించే.. అభిమానించే పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలంటూ జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో వారు పని చేస్తున్నారు. సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం, తిరుపతి లోక్సభ అభ్యర్థిత్వంపై బీజేపీ ఎటూ తేల్చకపోవడంతో జన సైనికుల్లో అసహనం నెలకొని ఉందనేది బహిరంగ రహస్యం. బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్తో వారు మరింత అసంతృప్తిని లోనవుతున్నారని అంటున్నారు.