డల్లాస్ సభలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి జగన్ నిరాకరించారా? రచ్చ చేస్తోన్న బీజేపీ..వైసీపీ ఏం చెబుతోంది
Recommended Video
అమరావతి: అమెరికాలోని డల్లాస్ సభలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాకరించారా? జ్యోతిని వెలిగిస్తున్నట్లు కేవలం చేతులు ముందుకు చాచి, ఆ తరువాత వెనక్కి వచ్చారా? ఫలితంగా- ఆ సభలో అసలు జ్యోతి ప్రజ్వలనే చేయలేదా? చేయలేదనే చెబుతోంది భారతీయ జనతాపార్టీ. జ్యోతి ప్రజ్వలన చేయకుండా వైఎస్ జగన్ కోట్లాదిమంది హిందువుల మనోభావాలను కించపరిచిందని విమర్శలు గుప్పిస్తోంది. హిందువుల ఓటు బ్యాంకు కోసమే ఆయన ఎన్నికల ప్రచార సమయంలో గుళ్లూ, గోపురాలను చుట్టొచ్చారని ఆరోపిస్తోంది. వైఎస్ జగన్ పై విమర్శలు సంధించడానికి దీన్నొక అస్త్రంగా వాడుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా దీనిపై ఓ మినీ యుద్ధానికి తెర తీశారు బీజేపీ నాయకులు.
అసలు కథేంటీ?
వైఎస్ జగన్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత పర్యటన కోసం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లారు. ఇందులో భాగంగానే ఆయన ఈ నెల 17వ తేదీన డల్లాస్ లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. సాధారణంగా- సెమినార్లు, వర్క్ షాపులు, కన్వెన్షన్లను ప్రారంభించడానికి జ్యోతిని వెలిగించడం సంప్రదాయం. అదే సంప్రదాయాన్ని నాటా ప్రతినిధులు కూడా అనుసరించారు. జ్యోతిని వెలిగించడానికి ఏర్పాట్లు చేశారు. సభ ప్రారంభానికి ముందు- జ్యోతిని వెలిగించాలని వైఎస్ జగన్ ను ఆహ్వానించారు. దీపస్తంభం వరకు వచ్చిన వైఎస్ జగన్ అక్కడి నుంచి వెనక్కి మల్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బీజేపీ ఆరోపణలేంటీ?
ఈ వీడియోను బీజేపీ రాష్ట్ర నాయకులు వైరల్ చేస్తున్నారు. వైఎస్ జగన్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారనేది వారు చేస్తోన్న ఆరోపణలతో స్పష్టమౌతోంది. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో.. వైఎస్ జగన్ హిందువుల ఓటు బ్యాంకు కోసమే గుళ్లు, గోపురాల పట్టుకుని తిరిగారని బీజేపీ నాయకుడు సీఎం రమేష్ విమర్శిస్తున్నారు. హిందువులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. జ్యోతిని వెలిగించకుండా కోట్లాదిమంది హిందువుల మనోభావాలను వైఎస్ జగన్ కించపరిచారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తరహాలో వైఎస్ జగన్ కూడా హిందూ ముసుగును ధరించారని విమర్శిస్తున్నారు. మతపరమైన రాజకీయాలకు ఆయన తెర తీశారని అంటున్నారు.
జ్యోతిని వెలిగించకపోవడానికి కారణాలేంటీ?
నాటా ఏర్పాటు చేసిన ఆ సభ అమెరికాలో అనే విషయాన్ని బీజేపీ విస్మరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇండోర్ కన్వెన్షన్ సెంటర్ కావడం వల్ల ఏ చిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా.. దానికి తీవ్రత, నష్టాలు అధికంగా ఉంటాయి. అందుకే- అమెరికా భద్రతా నిబంధనల ప్రకారం.. ఇండోర్ స్టేడియం లేదా కన్వెన్షన్ సెంటర్ లోనికి వెళ్లే సమయంలో- అగ్గిపెట్టే, లైటర్, క్యాండిల్ వంటివి అనుమతించరు. వాటిని స్టేడియం బయటే త్యజించాల్సి ఉంటుంది. అగ్నిప్రమాదానికి దారి తీసే ఎలాంటి వస్తువులను అక్కడి భద్రతా సిబ్బంది లోనికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వరు. లోపల స్టేజీ మీద ఉన్న జ్యోతి వెలిగించటానికి సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదని, అసలు నిప్పు వెలిగించకూడదని ముందే- తమకు సూచించారని నాటా ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
వేద పండితుల ఆశీర్వాదం కనిపించలేదా?
కన్వెన్షన్ సెంటర్ లోనికి ప్రవేశించే సమయంలో వైఎస్ జగన్ కు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారని, వారి ఆశ్వీరాదం తీసుకొన్న విషయం బీజేపీకి తెలియదేమో అని ఎద్దేవా చేస్తున్నారు. వేద పండితులు ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకుని, నుదుటిన సింధూరపు బొట్టు పెట్టుకొని వైఎస్ జగన్ కన్వెన్షన్ సెంటర్ లోనికి వచ్చారని గుర్తు చేశారు. అగ్గిపుల్లను వెలిగించడానికి అవకాశం లేదనే ఉద్దేశంతోనే తాము దీపస్తంభంలో వత్తులకు బదులుగా ఎలక్ట్రిక్ క్యాండిల్స్ అందుబాటులో పెట్టామని, అగ్గిపుల్లతో ఎలక్ట్రికల్ క్యాండిల్స్ ని వెలిగిస్తున్నట్లు కెమెరాల వైపు చూశారని అన్నారు. ఇలా చేయడంలో తప్పు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ని వెలిగిస్తున్నట్లు నాటకాలు ఆడితే భక్తి ఉన్నట్లా? నిజాయితీగా మనం చిన్న పనిలో కూడా మోసం చేయకూడదని అంటే భక్తి లేనట్లా ? అంటూ బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు వైఎస్ఆర్ సీపీ ప్రవాసాంధ్రుల విభాగం నాయకులు.
బూట్లు వేసుకుని చంద్రబాబు పూజలు చేసినప్పుడు విమర్శించలేదే?
భక్తి, మతం ముసుగులో ఓట్ల రాజకీయాల కోసం మాఫియా ముఠాలు చెలరేగుతున్నాయని, వాళ్లని అడ్డుకోకపోతే ఎంతకైనా దిగజారి, హైందవాన్ని భ్రష్టు పట్టించడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశానికి వంత పాడటం మొదలు పెట్టిన తరువాత బీజేపీ నాయకులకు జనరల్ నాలెడ్జి కోల్పోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో బూట్లు వేసుకుని పూజలు చేసినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. కాషాయరంగు కాస్తా పసుపురంగులోకి మారడానికి ఇక ఎంతో కాలం పట్టకపోవచ్చని చెబుతున్నారు. టీడీపీకి అనుబంధ పార్టీలా బీజేపీ తయారైందని ధ్వజమెత్తుతున్నారు.