సీఎం వైఎస్ జగన్ క్రిస్టియనా? ఎలా చెబుతారు? ఆధారాలేవి?: పిటిషనర్కు హైకోర్టు ప్రశ్న
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మతం ధృవీకరణపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం వైఎస్ జగన్ క్రిస్టియన్ అనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్ను హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు సమర్పించకుండా సీఎం జగన్ హిందువు కాదు.. క్రైస్తవుడని కోర్టుకు ఎలా చెబుతారని ప్రశ్నించింది.
హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ జగన్ లేఖ: రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి
ఏపీ సీఎం జగన్ క్రైస్తవుడనేందుకు ఆధారాలేవి?
ఎలాంటి వివరాలు సమర్పించకుండా పిటిషన్ విచారణలో ముందుకెళ్లడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీరామ్ అని పేరు పెట్టుకుంటే హిందువని, దేవానంద్ పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని ఎలా అనుకుంటామని ప్రశ్నించింది. సీం క్రైస్తవుడనే ఆధారాలు సమర్పించేందుకు గడువు ఇస్తామని పేర్కొంది. విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది.
ప్రతివాదిగా గవర్నర్ ఎందుకు?
కాగా, పిటిషన్లో గవర్నర్ను ప్రతివాదుల జాబితాలో చర్చడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. గవర్నర్కు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యర్థన కోరనప్పుడు ప్రతిపాదిగా చేర్చాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. గవర్నర్ను ప్రతివాదుల జాబితా నుంచి కోర్టు తొలగించింది. హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
చట్ట విరుద్ధంగా తిరుమల ఆలయంలోకి జగన్..
పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. తిరుమలలో హిందువులకు మాత్రమే అనుమతి ఉందని, దేవాదాయ చట్టం నిబంధన 136, 137 ప్రకారం హిందువేతరులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. క్రైస్తవుడైన సీఎం.. డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల ఆలయంలోకి వెళ్లారని చెప్పారు. ఇది దేవాలయ చట్టంలోని సెక్షన్ 97,153లకు విరుద్ధమని తెలిపారు.
Recommended Video
మేమెలా కోరతాం?.. తగిన ఆధారాలు సమర్పించండి?: హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు చట్ట నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని, సీఎం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేశారని చెప్పారు. దీనిపై టీవీల్లో కూడా చర్చలు జరిగాయన్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. టీవీల్లో చర్చల గురించి చెప్పొద్దన్నారు. జగన్ క్రైస్తవుడు అని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలేమున్నాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం స్పష్టతనిచ్చేలా కోరాలని న్యాయవాది బదులిచ్చారు. దీంతో తామెందుకు సీఎంని అడగాలి? పిటిషన్ దాఖలు చేసిన మీరే ఆధారాలు చూపాలని జడ్జీ స్పష్టం చేశారు. కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదని, అధికారులు కూడా చట్ట నిబంధనలు పాటించలేదని గుంటూరు జిల్లాకు చెందిన ఎ సుధాకర్ బాబు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అతని తరపు న్యాయవాది ఈ మేరకు వాదనలు వినిపించారు.