చంద్రబాబుకు భూమా ఫ్యామిలీ షాక్! గుడ్బై చెప్పడం ఖాయమైనట్టే?
Recommended Video
కర్నూలు: అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఎడాపెడా ఫిరాయింపులను దగ్గరుండి మరీ ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇక వరుస బెట్టి షాకులు తగులుతున్నాయి. ఏ ఫిరాయింపుదారులనైతే ఆయన తమ పార్టీలోకి చేర్చుకున్నారో.. వారే ఇప్పుడు చంద్రబాబుకు మొట్టికాయ వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడటానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నారు. మంచి ముహూర్తం చూసుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయ ప్రాభవాన్ని కోల్పోయిన బలమైన కుటుంబాలు..
జిల్లా రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే.. మొదట కోట్ల, ఆ తరువాత భూమా. ఈ రెండు కుటుంబాలు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య భూమా శోభా నాగిరెడ్డి హఠాన్మరణాల అనంతరం ప్రస్తుతం ఆ కుటుంబం ప్రాబల్యం తగ్గింది. ప్రాభవాన్ని కోల్పోయే దశకు చేరుకుంది. భూమా దంపతుల కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినప్పటికీ.. జిల్లా రాజకీయాలపై ఆమె పట్టు సాధించలేకపోయారు. దీనికి నిదర్శనం- మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం. అఖిలప్రియ మాత్రమే కాదు.. ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం పరాజయాన్ని చవి చూశారు.
దిగజారిన టీడీపీ పరిస్థితి..
జిల్లాలో అన్ని అసెంబ్లీ సీట్లు, రెండు లోక్సభ స్థానాలను సైతం కోల్పోయిన తరువాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి దిగజారింది. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా లేవనే అనుకోవచ్చు. నిజానికి 2014 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి జిల్లా రాజకీయాలపై పెద్దగా పట్టు నిలుపుకోలేదు. జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాలకు టీడీపీ గెలుచుకున్నది మూడు మాత్రమే. మొన్నటి ఎన్నికల్లో అవి కూడా దక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2024 ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడానికి సాహసించట్లేదు జిల్లా నాయకులు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతాపార్టీని ఎంచుకుంటున్నారు.
వైఎస్ఆర్ సీపీ ద్వారాలు మూసుకుపోయినట్టే..
ఈ నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీలో కొనసాగితే మనుగడ ఉండదని భావిస్తోంది భూమా కుటుంబం. అందుకే- పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దారులు, ద్వారాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వారు భారతీయ జనతాపార్టీ వైపు చూపులు సారించినట్లు చెబుతున్నారు. తొలుత- అఖిలప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం అఖిలప్రియ, ఆ తరువాత బ్రహ్మానంద రెడ్డి ఇద్దరూ కాషాయ కండువాను కప్పుకోవచ్చని సమాచారం. దివంగత నేత భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు కిశోర్ రెడ్డి. మండల పరిషత్ మాజీ సభ్యుడు కూడా. ప్రస్తుతం ఆయన నేడో రేపో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు జిల్లాలో జోరందుకున్నాయి. భూమా కిశోర్రెడ్డి హైదరాబాద్లోన కమలనాథులతో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.