లీడర్ నరేంద్ర మోడీ: బిజెపి కలర్ మారుతోందా?
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా రావడంతో నరేంద్ర మోడీ నాయకత్వంపై, ఆయన ప్లస్ పాయింట్లపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మోడీ నాయకత్వంలో బిజెపి రంగు మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గోద్రా అల్లర్ల మచ్చ ఆయనపై ఉన్నప్పటికీ గతంలోని మతం రంగును రూపుమాపుకుంటూ కొత్త రంగులను పులుముకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వంటి లౌకికవాద నాయకులు కూడా మోడీవైపు చూస్తున్నారు.
బిజెపికి ఎక్కువగా హిందూత్వ రంగును అద్దినవారు ఎల్కె అద్వానీ కాగా, దానికి లౌకికవాద రంగును అద్ది అటల్ బిహారీ వాజ్పేయి ఇతర పార్టీలను కలుపుకుని వచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి మరిన్ని అదనపు అంశాలను చేరుస్తోంది. మధ్యతరగతిని ఇతోధికంగా ఆకర్షించే అస్త్రాలను మోడీ ప్రయోగిస్తున్నారు. హిందూత్వను ద్వితీయం చేసి ఇతర అంశాలను ఆయన ప్రధానం చేసిన సూచనలు కనిపిస్తున్నాయి.
గుజరాత్ అభివృద్ధి, సుపరిపాలన అనేవి ఇప్పుడు మోడీ అస్త్రాలుగా మారాయి. పారదర్శకమైన పాలనను అందించడం, గుజరాత్ తరహా అభివృద్ధిని దేశమంతా అమలు చేయడం అనేవి ఆయనకు ప్రస్తుత కలిసి వస్తున్న అంశాలు. ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని కూడా ఇతోధికంగా వాడుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్జానాన్ని వాడుతున్నారు. నరేంద్ర మోడీ బిసి కావడం కూడా కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది.
నరేంద్ర మోడీ ఆచరణతో చదువుకున్న మధ్యతరగతి, యువత బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టి తన నినాదాలను, తన లక్ష్యాలను ఆయన ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. అది బిజెపికి కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు.