పవర్ స్టార్ నిన్న..మెగాస్టార్ నేడు..!! బీజేపీ కొత్త టార్గెట్ ?
అమరావతి: కర్ణాటక తరువాత దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది భారతీయ జనతాపార్టీ. ఏ ఒక్క అవకాశాన్ని కూడా జార విడుచుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని కనపర్చుతున్న ప్రాంతీయ పార్టీలకు ధీటుగా ఎదగడానికి పావులు కదుపుతోంది. 2024 ఎన్నికల నాటికి అటు తెలంగాణ, ఇటు ఏపీల్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. నయానో, భయానో.. ప్రతిపక్ష పార్టీల నుంచి కాస్త పేరున్న నాయకుల కోసం గాలం వేస్తోంది. కర్ణాటకలో అద్భుత ఫలితాలను ఇచ్చిన ఆపరేషన్ కమల తరహా ఎత్తులు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
పవర్ స్టార్ తలపై తుపాకీ పెట్టేంత ఒత్తిడి..
జనసేనను విలీనం చేయాలని కోరుతూ ఓ జాతీయ పార్టీ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకుని వస్తోందంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. విజయవాడ పార్లమెంటరీ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఓ జాతీయ పార్టీ తనపై తట్టుకోలేనంత ఒత్తిడిని తీసుకొచ్చి, పార్టీని విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి చెప్పారు. తన తలపై తుపాకి పెట్టి మరీ విలీనం ప్రతిపాదనను తీసుకొచ్చిందని అన్నారు. తలపై తుపాకి పెట్టి భయపెట్టినా జనసేన పార్టీని అందులో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విలీనం విషయాన్ని పవన్ కల్యాణ్ హఠాత్తుగా తెర మీదికి తీసుకుని రావడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు చెబుతున్నారు పార్టీ నాయకులు. ఈ ప్రతిపాదనల నేపథ్యంలో- పవన్ కల్యాణ్ తీవ్ర మానిసక ఒత్తిడిని అనుభవించారని అంటున్నారు. అందుకే- తల మీద తుపాకీ పెట్టారనే పదాన్ని ఆయన ప్రయోగించాల్సి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఆ జాతీయ పార్టీ టార్గెట్ లో మెగాస్టార్ కూడా..
ఇదే తరహా ఒత్తిడిని పవన్ కల్యాణ్ సోదరుడు, టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవిపైనా తీసుకొస్తోందనేది తాజా సమాచారం. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, అనంతరం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. ఆ తరువాత కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన చోటు చేసుకోవడం, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిపోవడం వంటి చేదు ఫలితాలు వెలువడటంతో ఆయన పార్టీకి దూరంగా ఉండిపోయారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి బీజేపీలో చేరుతారనే వార్తలు కూడా గుప్పుమన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటినేవీ ఆయన తోసి పుచ్చలేదు. అలాగని సానుకూలంగా స్పందించనూ లేదు. తన సినిమాలేవో తాను తీసుకుంటూ వెళ్లారు. ఈ పరిస్థితుల్లో తాజాగా- మరోసారి ఆయన రాజకీయాలపై మాట్లాడారు. బీజేపీలో చేరికపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ అంశంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి కూడా.
సైరా ప్రమోషన్ లో రాజకీయాల ప్రస్తావన
ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం `సైరా` ప్రమోషన్ లో ఉన్నారు. కొణిదెల ప్రొడక్సన్స్ బ్యానర్ పై చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. రాయలసీమకు చెందిన మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇందులో భాగంగా- ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో.. తన రాజకీయ జీవితాన్ని ప్రస్తావించారాయన. నేరుగా బీజేపీ పేరునే ప్రస్తావించారు. తాను పార్టీలో చేరాలని బీజేపీ అగ్ర నాయకత్వం కోరుకుంటోందనే విషయం తన దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.
నా ప్రమేయం లేకుండా..ఎలా
తన ప్రమేయం లేకుండా బీజేపీలో ఎలా చేరగలననీ అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని అన్నారు. సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టాననీ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తోంటే.. బీజేపీ పెద్ద కసరత్తే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకేసారి పవర్ స్టార్, మెగాస్టార్ ను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా యువతను ఆకట్టుకోవాలనేది ఆ పార్టీ వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేంద్రమంత్రిగా పని చేసినప్పటికీ.. చిరంజీవి రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేయలేకపోయారు. సొంతంగా పార్టీని స్థాపించడంలో చూపించిన సాహసం.. ఆ తరువాత దాన్ని కొనసాగించడంలో ప్రదర్శించలేకపోయారని అంటున్నారు. ఇప్పటికీ.. మెగాస్టార్, పవర్ స్టార్ ల పట్ల యూత్ లో ఉన్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి బీజేపీ ఎలాగైనా ఆయనను ఆకర్షించాలనే కృతనిశ్చయంతో కనిపిస్తోన్నట్లు అభిప్రాయపడుతున్నారు.