బాబుపై బిజెపి అసంతృప్తి!: 'బయటకి చెప్పుకోలేక బాధపడ్తున్నారు'
రాజమండ్రి: తమ పార్టీ నాయకులు ఉత్సాహంగా పని చేయకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందని సినీ నటుడు, బిజెపి నేత కృష్ణం రాజు శనివారం నాడు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. టిడిపి చర్యలను బయటకు చెప్పుకోలేక తమ పార్టీ నేతలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపితోని పైస్థాయి నాయకులు మాత్రమే టిడిపితో కలిసి ఉండాలని భావిస్తున్నారన్నారు. ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న ఈ వ్యవహారం పెరగకుండా ఉండేందుకే తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వస్తున్నారని, సమన్వయం చేస్తారని అన్నారు. బిజెపి సొంతగా నిలబడే స్థితికి రావాలన్నారు.
నిన్న మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న మాట వాస్తవమేనని కృష్ణం రాజు శుక్రవారం నాడు అన్నారు. ఏపీలో బిజెపి బలోపేతంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... కొన్ని ఇబ్బందులు వాస్తవమేనని చెప్పారు.
పైస్థాయిలో బిజెపి - తెలుగుదేశం పార్టీ మధ్య అవగాహన బాగానే ఉందని చెప్పారు. కానీ కిందిస్థాయిలో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. మార్చి 6వ తేదీన జరగనున్న బిజెపి సమావేశానికి పార్టీ అధ్యక్షులు అమిత్ షా హాజరవుతారని చెప్పారు. సమావేశంలో చర్చిస్తే ఇబ్బందులు అన్నీ ఓ కొలిక్కి వస్తాయని చెప్పారు.
అమిత్ షా పర్యటన తర్వాత మాత్రం సమస్యలు సర్దుబాటు అవుతాయని కృష్ణం రాజు చెప్పారు. అదే సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని, అదంతా తమ ఘనతగా టిడిపి ప్రచారం చేసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఈ అంశాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో బిజెపిని స్వతంత్రంగా ఎదగనీయకుండా టిడిపి అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రంలో బిజెపి బలాన్ని చాటేందుకే రాజమండ్రి సభను వేదికగా చేసుకుంటున్నట్లు చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం అనేక రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు.