రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు- మరో కోణం, ఎన్నో డౌట్స్: అసలు టార్గెట్ వేరే ఉందా?
హైదరాబాద్/అమరావతి: ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు, ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. రేవంత్ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు.
Recommended Video
అయితే అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఈ సోదాలు కలకలం రేపాయి. కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యపూర్వకంగా కేసీఆర్ టార్గెట్ చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. తన తాత, ముత్తాతలకు ఆస్తి బాగా ఉందని, తాను ఎప్పుడూ ఒకే ఆస్తి చూపించానని, కానీ క్రమంగా వాటి మార్కెట్ రేటు పెరిగిందని చెప్పారు.
రేవంత్ అనుమానాలు
అదే సమయంలో రేవంత్ ఇంకా మాట్లాడుతూ.. అసలు మైం హోం రామేశ్వర రావు సహా పలువురి అక్రమాలకు సంబంధించిన అంశాలను తాను ఆర్టీఐ ద్వారా తీసుకున్నానని, వాటిని అధికారులు తీసుకెళ్లారని తాను అంటున్నానని చెప్పారు. తద్వారా, అసలు తాను కేసీఆర్ సన్నిహితులకు చెందిన అక్రమాలను బయటపెట్టేందుకు సమీకరించిన పత్రాలను తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.
ఐటీ దాడుల వెనుక మరో కోణం
ఏది ఏమైనా, ఈ ఐటీ దాడుల వెనుక మరో కారణం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదే ఓటుకు నోటు అంశం. ఓటుకు నోటులో రేవంత్ కీలకం. ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయన వెనుక చంద్రబాబు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఇంట్లో సోదాల ద్వారా ఓటుకు నోటే లక్ష్యమని చెబుతున్నారు. అంతకుముందు తెరాస నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో, ఇప్పుడు రేవంత్ నివాసంలో సోదాలు చేశారని, రేపు చంద్రబాబును టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఓటుకు నోటు కేసు లక్ష్యంగా దాడులా?
ఓటుకు నోటు కేసును తవ్వడమే లక్ష్యంగా ఐటీ దాడులు జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ నివాసంపై ఐటీ దాడుల సమయంలో ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సిన్హా, సెబాస్టియన్ ఇళ్లలోను సోదాలు జరిగాయి. రేవంత్, మిగతా వారిని తమ ఎదుట హాజరు కావాలని ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. కాబట్టి ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు.
ఒత్తిడితో దాడులు జరిగాయా?
కేంద్రం ఒత్తిడితోనే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని, దాదాపు మూడ్రోజుల పాటు సోదాలు చేశారని, ఆస్తుల జాబితాతో పాటు ఓటుకు నోటు కేసు పైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించారని వార్తలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షల వ్యవహారమే కేంద్రంగా సోదాలు జరిగాయని, విచారణ జరిగిందని అంటున్నారు. అ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీశారని అంటున్నారు. ఉదయ్ సిన్హాను కూడా రేవంత్ ఇంటికి తీసుకు వచ్చి ప్రశ్నించారు.
ఇక్కడే ఎన్నో అనుమానాలు
ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల ఇళ్లలో సోదాలు జరిపారు ఐటీ అధికారులు. వారిని అక్టోబర్ 1న ఆయాకార్ భవన్కు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ముందుకు వెళ్లనున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 3న రేవంత్ హాజరు కావాల్సి ఉంది. ఓటుకు నోటు కేసు తేల్చేందుకు ముందు ముందు ఏమైనా జరగవచ్చునని అంటున్నారు.