దేవుడి దగ్గర కూడా కుల రాజకీయమా..?టీటీడీ పాలక మండలి కూర్పు పై మండిపడ్డ టీడిపి..!!
అమరావతి/హైదరాబాద్ : అదికార వైసిపి పార్టీపై ప్రతిపక్ష టీడిపి మరోసారి భగ్గుమంది. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఘాటు విమర్శాలు చేస్తోంది టీడిపి. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పడం, పోలవరం టెండర్లను నిలిపివేయడం, రాజధాని అంశంలో అయోమయాన్ని సృష్టించడం, కక్ష పూరిత రాజకీయాలు, టీడిపి నేతలపై దాడులు నిర్వహించడం వంటి చర్యలను ప్రతిపక్షపార్టీ తప్పుబడుతోంది.
ఏడుకొండల వాడి దగ్గర వివక్ష..! పాలక మండిలి కూర్పుపై ప్రతిపక్షం పెదవి విరుపు..!!
అంతే కాకుండా అదికార వైసీపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ల అంశంలో కులాల కురుక్షేత్రం నడుస్తోందని, ఒక సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని టీడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ నియిమకాలు జరుగుతున్నాయని, కొన్ని చోట్ల ఈ ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోందని టీడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా అందరి కోర్కెలను తీర్చే ఆపదమొక్కుల వాడి దగర కూడా వైసీపి తారతమ్యాలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు తెలుగుతమ్ముళ్లు.
కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్న జగన్..! ఘాటుగా విమర్శిస్తున్న టీడిపి..!!
ఇదిలా ఉండగా విలేఖరులకు సంబందించి కూడా ఏపి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని మండి పడుతోంది ప్రతిపక్ష పార్టీ. మీడియా సలహా దారులుగా తెలంగాణ వ్యక్తులను నియమించడమే కాకుండా, జాతీయ స్ధాయిలో కూడా వివక్ష చూపారని విమర్శిస్తోంది ప్రతిపక్ష పార్టీ. ఏపిలో అంత సమర్ధత ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఏపి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏపి జర్నలిస్తులను జగన్ ప్రభుత్వం అవమానించిందని టీడిపి చెప్పుకొస్తోంది.
టీటీడిలో వెనుకబడిన వర్గాలు ఎక్కడ..! సూటిగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం..!!
ఇటీవల ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులలో తెలంగాణ రాష్ట్రం నుండి ఏడుగురికి అవకాశం కలిపిస్తే అందులో ఐదుగురిని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సూచించిన వారినే ఎంపిక చేసారని టీడిపి ఆరోపిస్తోంది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ లు ఎవ్వరు లేకపోవడం విచారకరమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తం బంధువులు స్నేహితులనే ఎంపిక చేసుకున్నారని విమర్శలు గుప్పిస్తోంది. మిగతా ఇద్దరు వైఎస్సార్సీపీ కి చెందినవారని చెప్పుకొస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో టీటీడీ మండలిలో తెలంగాణ నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు ఇచ్చారని టీడిపి గుర్తు చేస్తోంది.
దేవుడి దగ్గర వ్యత్యాసాలొద్దు..! సమన్యాయం చేయాలంటున్న టీడిపి..!!
చివరికి రాష్ట్ర విభజన తరువాత టీడిపి ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుండి దళితులకు అవకాశం ఇచ్చారు. నేడు తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒక్క దళితుడు, గిరిజనుడు, బీసీలకు అవకాశం కల్పించలేదని, ఇదే సంస్కృతి ఏపి కి పాకిందని టీడిపి నేతలు అంటున్నారు. తెలంగాణలో మాల మాదిగల పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వివక్ష చూపుతున్నట్టే తిరుమల తిరుపతి దేవస్ధానం అంశంలో జగన్ మోహన్ రెడ్డి వివక్ష చూపుతున్నారని తెలంగాణ టీడిపి నేతలు విమర్శిస్తున్నారు.