చంద్రబాబు మెడకు చుట్టుకుంటోన్న కుమారస్వామి రాజీనామా
బెంగళూరు: కర్ణాటకలో14 నెలల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాత్రి శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం 99-105 సభ్యుల తేడాతో ఓటమి పాలైంది. ఆ వెంటనే- కుమారస్వామి రాజీనామా పత్రాన్ని గవర్నర్ వజూభాయ్ వాలాకు అందజేయడం, ఆయన వెంటనే దాన్ని ఆమోదించడం.. చకచకా సాగిపోయాయి.
హైటెక్ సిటీ నిర్మించి తప్పు చేశాను..! ఏపి అభివృద్దికి జగనే అడ్డంకి అన్న చంద్రబాబు..!!
చంద్రబాబే కారణమట..!
ఇదిలావుండగా- కర్ణాటకలో ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి, కుమారస్వామి రాజీనామా చేయడానికి గల మూలాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వ్యవహారం మొత్తం మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి మెడకు చుట్టుకుంటోంది. దీన్ని అడ్డుగా పెట్టుకుని నెటిజన్లు, ట్విట్టరెట్టీలు చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు. దీనికి సహేతుక కారణాలను కూడా చూపడం ఈ ఎపిసోడ్లో ఆసక్తికరమైన ట్విస్ట్. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఊపిరి కోల్పోవడానికి పరోక్షంగా చంద్రబాబే కారణమని అంటూ ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు.
కుమార ప్రమాణానికి హాజరు కావడం..
కుమార ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడమే.. ఇప్పుడీ సంకట పరిస్థితి కారణమైందనేది నెటిజన్ల నోటివాక్కు. చంద్రబాబు పాద మహిమ ఫలితంగా - కుమార సర్కార్ కుప్పకూలిందని చురకలు అంటిస్తున్నారు. 2018లో మే 23వ తేదీన బెంగళూరు విధానసౌధ వద్ద ఆట్టహాసంగా నిర్వహించిన కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరైన విషయం తెలిసిందే. కొన్ని గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బహుజన్ సమాజ్వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి.. వీళ్లంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్తో చెట్టాపట్టాల్
చంద్రబాబు కాంగ్రెస్తో దోస్తీ మొదలు పెట్టిందీ అప్పటి నుంచే. చనువుగా రాహుల్ గాంధీ వీపు మీద చెయ్యేసి మాట్లాడుతున్న చంద్రబాబు ఫొటోలు అప్పట్లో ఏ రేంజ్లో సర్క్యులేట్ అయ్యాయో తెలిసిన విషయమే. తాను ప్రచారం చేయడం వల్లే కర్ణాటకలో భారతీయ జనతాపార్టీ ఓటమి పాలైందని కూడా చంద్రబాబు చెప్పుకొన్నారు. తెలుగువారి ప్రాబల్యం గల జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి- బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తన వల్లే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందని చంద్రబాబు బాహటంగా చెప్పుకొన్నారు కూడా. తన ముందు బీజేపీ పప్పులు ఉడకబోవని, తనతో పెట్టుకుంటే ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని అన్నారు.
తన వల్లే బీజేపీ ఓడిదంటూ..
మొన్నటికి మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) అభ్యర్థి తరఫున కూడా ప్రచారం చేశారు చంద్రబాబు. మండ్య లోక్సభ నియోజకవర్గానికి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను గెలిపించాలని, బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన తెలుగింటి ఆడపడచు, ప్రముఖ నటి సుమలతను ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగింటి ఆడపడచు ఓటమికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, కాలికి బలపం కట్టుకుని మరీ మండ్య వెళ్లి ప్రచారం చేసొచ్చారని ఆయనపై విమర్శలు చెలరేగినప్పటికీ పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో నిఖిల్ గౌడ ఓడిపోయారు. ఇన్నీ చేసినప్పటికీ- కుమారస్వామి పదవి కోల్పోయే దశలో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎందుకు చక్రం తిప్పలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.