రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్: పసుపు-కుంకుమ మహిళలపై ప్రేమతో కాదా, కేసీఆర్పై కోపంతోనా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పసుపు - కుంకుమ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్గా చేసుకొని తీసుకున్న నిర్ణయమా? అంటే అవుననే అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి, ప్రచారం చేశారని, తాము కూడా ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టి టీడీపీ అధినేతకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఇది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు వరాల జల్లు
తాజాగా, చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏపీలో వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పసుపు - కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, ఇటీవల చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. 'ఆడపడుచులకు తెలుగింటి సంప్రదాయం పసుపు-కుంకుమ. ఓ అన్నగా మీకు నేను ఇస్తోన్న బహుమతి ఇది. దీనికి ప్రతిగా ఒకటే కోరుతున్నా. ఈ మధ్య ఓ పెద్ద మనిషి నాకు రిటర్ను గిఫ్టు ఇస్తానన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సత్తా తెలిసేలా ఆయనకు మీరే గిఫ్టు ఇవ్వాలి.' అని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్కు షాకిచ్చేందుకేనా?
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వేలుపెట్టినా, ప్రచారం చేసినా అది వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫునే అని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు పసుపు -కుంకుమ కోసం దాదాపు రూ.10 కోట్ల మేర ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారట. ఇదంతా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్కు షాకివ్వడానికి, తద్వారా జగన్కు చెక్ చెప్పేందుకు ఉపయోగిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. మొత్తానికి పసుపు - కుంకుమ పథకం ద్వారా ఓట్లు తమవైపు మళ్లించుకోవాలని, తద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్కు గట్టిగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.
ప్రజల సొమ్ము అంటూ విమర్శలు
అయితే, అన్న అంటే ఆడపడుచులకు సొంత డబ్బు ఇవ్వాలని, కానీ ఇవి సర్కారు సొమ్ములని, అయినా చంద్రబాబుకు... కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్కు సంబంధం ఏమిటని, కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ అంటే.. ఓడిపోకుండా ఏకంగా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన కోట్లాది రూపాయలను ఖర్చు చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారా అనే చర్చ సాగుతోంది.