నెహ్రూ వార్నింగ్, 'మహేష్ బాబు'తో చెక్: పవన్పై బాబు మైండ్గేమా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ రాజకీయ వర్గాల్లో బాగా చర్చనీయాంశమవుతోంది. తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. ఆయన టార్గెట్కా తెలుగుదేశం పార్టీ బెదిరింపులు, బుజ్జగింపులకు పాల్పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇందుకు ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రచారమే నిదర్శనమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటన అనంతరం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే స్వాగతించారు. పవన్ నిర్ణయాన్ని వారు స్వాగతిస్తూనే భిన్నమైన ధోరణి అవలంభిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
టిడిపి నేతలు గాలి ముద్దుకృష్ణమ, బొండా ఉమలు మాట్లాడుతూ... గతంలో తాము పవన్ కళ్యాణ్ సహకారం వల్ల కూడా గెలుపొందామని, గతంలో పొత్తుతో ఉన్నందున 2019 ఎన్నికల్లోను తమకు ఆయన మద్దతు లభిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ఆయన ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయరని తాము భావిస్తున్నామని పరోక్ష హెచ్చరిక చేశారని అంటున్నారు.
ఓ వైపు పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోకుండా వ్యవహరిస్తూనే, ఆయన ఒకవేళ దూరం జరిగితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదనే తరహాలో తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు.
టిడిపి నేతల వ్యాఖ్యలతో పాటు ఆ పార్టీలో చేరకముందు జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు పవన్ కళ్యాణ్కు హెచ్చరిక లేదా మైండ్ గేమ్గా భావిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ సోమవారం టిడిపిలో చేరారు.
అంతకుముందు రోజు ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. వాటిని టిడిపిలో చేరకముందే నెహ్రూ తిప్పికొట్టారు. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతుంటారని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లో ఒకలా, ఆపై తుళ్లూరుకు వచ్చి మరోలా మాట్లాడే పవన్ కళ్యాణ్ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తామని, అయితే, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలపై తనకు విశ్వాసం లేదన్నారు. నిన్న ఓ మాట చెప్పి, ఆపై రేపు తాను చెప్పిన దానికే భిన్నంగా వ్యాఖ్యానించడం పవన్ నైజమన్నారు. ఆయన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
దాంతో పాటు తాజాగా, మహేష్ బాబు పేరుతో మరో హెచ్చరిక చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత.. పవన్ పట్ల సానుకూల వైఖరి అవలంభిస్తూనే మహేష్ బాబును తెరపైకి తీసుకు రావడం వెనుక ప్లాన్ దాగి ఉందని అంటున్నారు.
ఎంపీ గల్లా జయదేవ్ ద్వారా మహేష్ బాబు కోసం మంత్రాంగం నడుస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ పైన టిడిపి మైండ్ గేమ్ అని అంటున్నారు.
అందుకు మహేష్ బాబు గతంలో వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఆయన రాజకీయాలలో తలదూర్చాలనుకుంటే ఎప్పుడో దూర్చేవారని, ఆయన పూర్తిగా దూరంగా ఉంటున్నారని అంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే.. గల్లా జయదేవ్ టిడిపిలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నందు ఆయన బావమరిది, హీరో మహేష్ బాబు టిడిపి తరపున లేదా ఆయన తరఫున ప్రచారం చేస్తారని భావించారని, కానీ తీరా ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కేవలం సామాజిక అనుసంధాన వేదికలో తన బావకు మద్దతుగా ఓ పోస్ట్ పెట్టారని గుర్తు చేస్తున్నారు.
పవన్ వ్యాఖ్యల తర్వాత టిడిపి నేతల వ్యాఖ్యలు, ఆయన ప్రకటనను స్వాగతించడం, అదే సమయంలో కొందరు నేతలు ఎద్దేవా చేయడం, ఆ తర్వాత మహేష్ బాబును, హీరో జూనియర్ ఎన్టీఆర్ను తెరపైకి తీసుకు రావడం టిడిపి వర్గం మీడియా.. పవన్ కళ్యాణ్ పైన ఆడుతున్న మైండ్ గేమ్ అంటున్నారు.