మళ్లీ ఫోన్ ట్యాపింగా?...చంద్రబాబు అనుమానం:కమ్యూనికేషన్ సిస్టంలో పూర్తి మార్పులు
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబుకు మళ్లీ తన ఫోన్ ట్యాపింగ్కు గురవుతున్నట్లు అనుమానం వచ్చిందా అంటే అవుననే తెలుస్తోంది. అందుకే ఆయన తన వ్యక్తిగత వ్యవహారాల కోసం ఉపయోగించే కమ్యూనికేషన్ వ్యవస్థని ఆగమేఘాల మీద సమూలంగా మార్చేసినట్లు సమాచారం.
రాష్ట్ర విభజన జరిగిన కొత్తల్లో తెలంగాణా అధికార పార్టీ టిఆర్ఎస్ తో వైరం నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్లోనే నివసిస్తున్న తరుణంలో "ఓటుకు నోటు" వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇటీవలే కేంద్రంలోని ఎన్టీయే ప్రభుత్వం నుంచి వైదొలిగాక ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుమానం వచ్చిందంటున్నారు. అందుకే ఇలా యుద్దప్రాతిపదికన కమ్యూనికేషన్ల సిస్టంలో మొత్తం మార్పులు చేశారని అభిప్రాయపడుతున్నారు.
బాబు కదలికలపై...కేంద్రం నిఘానా?
ప్రధాని మోడీపై విమర్శల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన కదలికలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే సిఎం చంద్రబాబు తన పర్సనల్ వ్యవహారాల కోసం ఉపయోగించే కమ్యూనికేషన్ల వ్యవస్థలో సమూల మార్పులు చేసి మరింత సురక్షితమైన, అత్యంత ఆధునికమైన సరికొత్త సిస్టమ్ ను ఏర్పాటుచేసుకున్నట్లు సమాచారం. సచివాలయంలోని సిఎంవోతో పాటు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనూ ఈ మార్పులు చేశారట.
మరిన్ని మార్పులు...ఆప్తుల్నికూడా!
సిఎం తన వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే ఫోన్ నెంబర్లతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో, టెలీ కాన్ఫరెన్స్ల నిర్వహణకు వినియోగించే సమాచార వ్యవస్థనీ, అలాగే కుటుంబ సభ్యుల కమ్యూనికేషన్ల వ్యవస్థనీ మార్చేసినట్లు తెలిసింది. అంతేకాదు తనతో సన్నిహితంగా మెలిగే అంతరంగీకులు, ఇతర ముఖ్య నేతల సమాచార వ్యవస్థలో కూడా వెంటనే మార్పులు చేసుకోవాలని ఆదేశించారని ఈ విషయం టిడిపి లోని మిగిలిన ముఖ్య నేతల ద్వారా బైటకు పొక్కినట్లు తెలుస్తోంది.
గతంలో ఒక నెట్ వర్క్...తాజాగా మరో నెట్ వర్క్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకుముందు తనతో, మోడీతో సన్నిహితంగా మెలిగే ఒక ముంబై ప్రముఖ వ్యాపార దిగ్గజంకి చెందిన మొబైల్ నెట్ వర్క్ వాడేవారట. అయితే తాజాగా ఆయన ఆ నెట్ వర్క్ తొలగించి ఇండియాలో విశ్వసనీయమైన సంస్థగా గుర్తింపు పొందిన మరో సంస్థకు చెందిన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారట. అవి కూడా మిగిలిన సమాచార వ్యవస్థకు భిన్నమైన ప్రత్యేకమైన డెడికేటెడ్ లైన్లు గా తెలుస్తోంది. ఈ డెడికేటెడ్ లైన్లో సంభాషణలు జరిపితే ట్యాపింగ్ చేయడం అంత సులభం కాదనంటున్నారు. ఈ లైన్ల ద్వారా మాట్లాడుకునేవారికి తప్ప మూడో కంటికి ఆ నంబర్లు తెలిసే అవకాశం ఉండదంటున్నారు. ఇక ట్రూ కాలర్ వంటి వ్యవస్థల్లో వీటి గురించి వివరాలు వెల్లడయ్యే ఛాన్సే ఉండదని సమాచారం.
ఆ సంస్థ మీద...
ఆ సంస్థ మీద...నమ్మకం లేదా?అయితే తనతో, తన కుమారుడితో ఎంతో సన్నిహితంగా మెలిగే ఒక వ్యాపార దిగ్గజానికి చెందిన కమ్యూనికేషన్ల వ్యవస్థనే చంద్రబాబు మార్చేయడం టిడిపి శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మోడీకి మరింత సన్నిహితుడుగా భావించడం, అలాగే తాను నూతనంగా మారిన కమ్యూనికేషన్ల సంస్థ పాత సంస్థ కంటే సిఎంకు మరింత దగ్గరవడం ఆ వ్యవస్థకు మారడానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నూతన సంస్థకు తన అవసరాల గురించి చంద్రబాబు విపులంగా చెప్పి తన అభీష్టానికి అనుగుణంగా నూతన కమ్యూనికేషన్ల వ్యవస్థని సమకూర్చుకున్నారని సమాచారం.
ఇదే మొదటిసారి కాదు...గతంలోనూ!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా తన కమ్యూనికేషన్ల వ్యవస్థను మార్చుకోవడం ఇదే మొదటిసారి కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే తన కమ్యూనికేషన్ల వ్యవస్థలో సమూలంగా మార్పులు చేశారని వారు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన కదలికలపై నిఘా పెట్టిందని అనుమానించిన చంద్రబాబు అందుకే కమ్యూనికేషన్ వ్యవస్థను మార్చుకున్నారట. ఆ తరువాత నవ్యాంధ్రకు తొలి సిఎంగా బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నప్పుడు టిఆర్ఎస్ సర్కారు తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని చంద్రబాబు బహిరంగంగానే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అమరావతిలో నూతన కమ్యూనికేషన్ల వ్యవస్థ ఏర్పరుచుకున్న చంద్రబాబు తాజాగా మరోసారి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ వ్యక్తికైనా తన సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు ఉన్నందున...అందులోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన సమాచారం బైటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.