రాజమండ్రి ఘటన సహా అన్నీ తానై! అధికారులపై బాబు అసంతృప్తి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎంవో కార్యాలయంలో మార్పులు జరగనున్నాయా, సిఎంవో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నారా.. అంటే కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. సిఎంవోలో (ముఖ్యమంత్రి కార్యాలయం) ప్రక్షాళనకు అవకాశాలున్నాయంటున్నారు.
తన కార్యాలయంలోని అధికారుల పని తీరుపై చంద్రబాబు పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే సిఎంవోలో రెండుమూడు మార్పులు జరగగా, మరికొన్ని జరగవచ్చునని అంటున్నారు. ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న అజయ్ ప్రకాశ్ సాహ్ని కొద్ది రోజుల తర్వాత వెళ్లిపోయారు.
ఆ తర్వాత గిరిధర్, అనంతరం ప్రద్యుమ్న వచ్చారు. ఇప్పుడు ప్రద్యుమ్న స్థానంలో సాల్మన్ రాజు రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. నిఘా విభాగం అధికారిణిగా ఉన్న అనురాధ స్థానంలో ఇప్పటికే వెంకటేశ్వర రావు వచ్చారు.
ఇప్పటికి పని తీరు గాడిలో పడలేదని, కాబట్టి మరిన్ని మార్పులు జరగవచ్చునని అంటున్నారు. పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన తర్వాత రాజమండ్రిలో మకాం వేసిన చంద్రబాబు... అక్కడి అధికారుల పని తీరు చూసి ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. వారి నియామకాల పైన ఆరా తీశారట.
సిఎంవో పనితీరుపై కొందరు మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు తన కార్యాలయంతో పాటు మరికొన్ని శాఖల పరిధిలో కొందరు సలహాదారులను నియమించారు. వారి పని తీరు పైన కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన పైన చంద్రబాబు పైన విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. చంద్రబాబు గంటల తరబడి ఘాట్లో స్నానం చేయడం వల్లే రద్దీ పెరిగిపోయి తొక్కిసలాట జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే, తాను పూజ చేసిన ప్రాంతం ఒక పక్కన ఉంటే, మరోచోట తొక్కిసలాట జరిగిందని, ఈ రెండింటి మధ్య ప్రహరీ గోడ ఉందని, పైగా తాను వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు వారం రోజుల తర్వాత పార్టీ సమావేశంలో చెప్పే వరకు దీనిపై స్పష్టత రాలేదు. ఇంతపెద్ద సమస్య వచ్చినప్పుడు ఎవరు స్పందించకపోవడం, చాలా ఆలస్యంగా చంద్రబాబే వివరణ ఇచ్చుకోవడం చర్చనీయాంశమవుతోంది.