చంద్రబాబు కొత్త జిల్లాల జోలికి వెళ్తారా! వెళ్లకపోవడానికో కారణం?
విజయవాడ : ఇంతకుముందు ఉమ్మడిగా కొనసాగిన రాష్ట్రం.. ఇప్పుడు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ గా వేరయ్యాక.. ప్రతీ పనిలోను రెండింటి మధ్య పోలికే. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు తీసుకునే ప్రతీ నిర్ణయానికి ఇద్దరి మధ్య పోలిక తీసుకురావడం.. ఎవరి శక్తి సామర్థ్యాలేమిటో లెక్కగట్టడం పరిపాటిగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇటు తెలంగాణ ప్రజలతో పాటు అటు ఆంధ్రా ప్రాంత ప్రజల దృష్టి కూడా నిలిచింది. రెండూ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కాబట్టి.. కేసీఆర్ తరహాలో చంద్రబాబు కూడా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఏమైనా ఆలోచన చేస్తారా! అన్నది ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో మెదులుతోన్న ప్రశ్న. అయితే ఆర్థిక కారణాల రీత్యా.. సామాజిక కోణం దృష్ట్యా.. చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదనేదే ఎక్కువ మంది అభిప్రాయంగా వినబడుతోంది.
తెలంగాణతో పోలిస్తే.. ఏపీ ఆర్థికంగా కాస్త వీక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియంటే మళ్లీ ఖర్చుతో కూడుకున్న పనే అవుతుంది. కొత్త భవనాలను సమకూర్చడం.. కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు తగినంత మంది అధికారులను కేటాయించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. అదీగాక అధికార టీడీపీకి ఏపీలో సామాజికంగా ఎంతటి మద్దతు ఉందో అందరికీ తెలిసిన విషయమే.
ఇలాంటి పరిస్థితుల్లో.. జిల్లాల విభజన చేపడితే అది టీడీపీకి ప్రతికూలంగా మారుతుందనే అభిప్రాయాలు అనేకం వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాలను బాగానే హ్యాండిల్ చేస్తూ వస్తున్న చంద్రబాబుకు.. ఒకవేళ జిల్లాలను విభజిస్తే గనుక.. అది కాస్త జటిలంగా మారే అవకాశముంది. ముఖ్యంగా కాపు ఉద్యమం రాజుకుంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయం.. ప్రతిపక్ష పార్టీలను బలపరిచేదిగా మారినా.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
జిల్లాల విభజన వల్ల.. ఇప్పుడున్న సామాజిక కూర్పులోను భారీ మార్పులే చోటు చేసుకుంటాయి. ఆ ప్రభావం టీడీపీపై గనుక ప్రతికూలంగా పనిచేస్తే.. వైసీపీకి అవకాశమిచ్చినట్లవుతుంది కాబట్టి చంద్రబాబు కొత్త జిల్లాల జోలికి వెళ్లరనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇదే చర్చ అటు ఏపీ అంతటా సాగుతోంది.